హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి నిధుల విషయంలో అబద్ధాలు వల్లెవేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్సహా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి అందిస్తున్న సహకారంతోనే వారు తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రాజారాం యాదవ్, గొట్టిముక్కుల వెంకటేశ్వర్రావుతో కలిసి వినోద్కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఆదివారం చేవెళ్లసభలో హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాధ్యతగల హోదాలో ఉన్న నాయకుడు ఇతరులు రాసిచ్చిన ప్రసంగాన్ని చదివే క్రమంలో ఒకసారి అవి నిజమా? కాదా? అని సరిచూసుకోవాలని సూచించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బంగడుపుకొనేందుకు బీజేపీ యత్నిస్తున్నదని మండిపడ్డారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న అమిత్షా ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. తెలంగాణకు కోట్లాది రూపాయల నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి అమిత్షాసహా బీజేపీ నేతలు పదేపదే వ్యాఖ్యానించడాన్ని ఆక్షేపించారు. కేంద్రం తెలంగాణకు భిక్ష వేయడం లేదని, అది తెలంగాణ హక్కు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాష్ర్టానికి నయాపైసా ఇయ్యలె
జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నయాపైసా కూడా ఇవ్వలేదని వినోద్కుమార్ తేల్చిచెప్పారు. పెట్రోల్, డీజిల్ పన్నుల రూపంలోనే కాకుండా సెస్సు రూపంలో (సీఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ఫండ్) తెలంగాణ నుంచి 8 ఏండ్ల కాలంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.39,186 కోట్లు అయితే.. కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చింది రూ.3,400 కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. ఈ లెక్కన జాతీయ రహదారులకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తున్నదని, ఈ తరహా అభివృద్ధి ఏ బీజేపీపాలిత రాష్ట్రంలోనైనా ఉందా? అని ప్రశ్నించారు.
అమిత్షా నోటివెంట అన్నీ అబద్ధాలే
చేవెళ్ల సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ అబద్ధాలే మాట్లాడారని, తెలంగాణ నిధుల విషయంలో అసత్యాలు చెప్పారని వినోద్కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ర్టానికి రూ.30 వేల కోట్లు, 2023లో రూ.లక్ష కోట్లు ఇచ్చామని అమిత్షా వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. 2014లో కేంద్రప్రాయోజిత (సెంట్రల్లీ స్పాన్సర్డ్) పథకాలు, ఫైనాన్స్ కమిషన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటా ఇలా అన్ని విభాగాలు మొత్తం కలిపి తెలంగాణకు వచ్చింది కేవలం రూ.15,307 కోట్లేనని తేల్చిచెప్పారు. 2023లో రూ. 32,756 కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. అమిత్షాసహా ఏ బీజేపీ నాయకుడికైనా తాను చెప్పే గణాంకాలు తప్పని నిరూపించే సత్తా ఉందా? అని ఆయన సవాల్ విసిరారు.