Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాబహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. చేవెళ్ల సభ సాక్షిగా అమిత్ షా అసత్యాలు చెప్పారని విమర్శించారు. హైదరాబాద్లో సోమవారం మంత్రుల నివాస సముదాయం వద్ద ఆయన బీఆర్ఎస్ నేతలు రాజారాంయాదవ్, గొట్టి ముక్కుల వెంకటేశ్వర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా నేతలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి అందిస్తున్న సహకారంతోనే వారు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు రాజకీయంగా ఇతర పార్టీలపై చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగల హోదాలో ఉన్న నాయకుడు మాట్లాడేముందు ఇతరులు రాసిచ్చిన ప్రసంగాన్ని చదివే క్రమంలో ఒకసారి అవి నిజమా?
కాదా? అని సరిపోల్చుకోవాలని హితవు పలికారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడపడమే బీజేపీ సిద్ధాంతమని ప్రపంచతా తెలుసునన్నారు. మిగతా రాష్ట్రాల్లో ప్రజల మధ్య ఇలా చిచ్చు రాజకీయం చేసినట్టు తెలంగాణలో చేస్తామంటే కుదరదనే విషయాన్ని అమిత్షా సహా బీజేపీ నేతలందరూ తెలుసుకుంటారన్నారు.
తెలంగాణకు కోట్లాది రూపాయల నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి అమిత్షా సహా బీజేపీ నేతలు పదేపదే చేసిన వ్యాఖ్యలపై వినోద్కుమార్ మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు భిక్షం ఇవ్వడం లేదని, అది తెలంగాణ హక్కు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జాతీయ రహదారులకు నిధులు ఇవ్వడం అన్నది ప్రజల హక్కు అని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అనేకసార్లు అనేక రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా చెప్పామని, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి, శ్రీకృష్ణకమిటీకి అన్ని రంగాల్లో తెలంగాణ తీవ్ర వివక్ష గురైన అంశాలను లెక్కలతో సహ బీఆర్ఎస్ పార్టీ వివరించిన కారణంగానే విభజన చట్టంలో రాష్ర్టానికి దక్కాల్సిన హక్కులను పొందుపరిచారనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తుంటే కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు తెలంగాణ బిడ్డలుగా గర్వపడాలన్నారు. బీజేపీ నేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాలనే కేంద్ర బీజేపీ నాయకత్వానికి సహకరించటం దారుణమన్నారు.
అమిత్ షా చేవెళ్ల సభలో ప్రసంగం అంతా అబద్ధమేనని వినోదకుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 2014లో రాష్ట్రానికి రూ.30వేలకోట్లు ఇచ్చామని, అదే 2023లో రూ.కోటికోట్లు ఇచ్చామని అమిత్షా చెప్పడాన్ని ఆయన ఖండించారు. 2014లో కేంద్రప్రాయోజిత (సెంట్రల్లీ స్పాన్సర్డ్) పథకాలు, ఫైనాన్స్ కమిషన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రవాటా ఇలా అన్ని విభాగాలు మొత్తం కలిపి తెలంగాణకు వచ్చింది కేవలం రూ.15,307 కోట్లేనని స్పష్టం చేశారు. 2023లో రూ.32,756 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. అమిత్షా సహా ఏ బీజేపీ నాయకుడికైనా తాను చెప్పే గణాంకాలు తప్పని నిరూపించే సత్తా ఉందా? అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ విషయంలో తాను ఏ వేదికకైనా చర్చకు సిద్ధమేనన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న అమిత్షా ఇంత బాధ్యతారాహిత్యంగా పేర్కొనడం దారుణమన్నారు. రాజకీయాల కోసమే హోదాను, మర్యాదలను మంటగలపకూడదన్నారు. చేవెళ్ల సభసాక్షిగా ప్రజలను అవమానపరచిన అమిత్షా తెలంగాణ ప్రజలకు బహిరంగ చెప్పాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారుల్లో రాష్ట్రానికి నయాపైసా ఇవ్వలేదని, వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజీల్ పన్నుల రూపంలోనే కాకుండా సెస్సు రూపంలో (సీఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ఫండ్) తెలంగాణ నుంచి 8 సంవత్సరాల కాలంలో కేంద్రానికి వెళ్లిన సొమ్ము రూ.39,186 కోట్లు అయితే కేంద్రం నుంచి రాష్ర్టానికి వచ్చింది రూ.3400 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఈ లెక్కన జాతీయ రహదారులకు కేంద్రం వచ్చింది ఏమీ లేదన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ఈ తరహా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో కటే గొప్పగా అభివృద్ధి జరిగిందని నిరూపించే సత్తా ఏ బీజేపీ నాయకుడికి ఉందో చెప్పాలంటూ వినోద్కుమార్ సవాల్ విసిరారు.