CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘మానవతను మరచి, మనుగడను చిత్రవధ చేసి, అదే పాలన అని విర్రవీగే కాలంపోయిననాడే నిజమైన జాతివికాసం’ అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చేసిన సూత్రీకరణను తెలంగాణ ఆచరించి చూపుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సమాంతర సమున్నత శిఖరాలుగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ‘బహుజన హితా య.. బహుజన సుఖాయ’లోని అంతస్సూత్రాన్ని అవలోకనం చేసుకున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని బడు గు, బలహీన వర్గాలకు అండగా నిలిచే కార్యాచరణను రూపొందించి విజయవంతంగా అమలు చేస్తున్నారు.
బహుజన సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే తలమానికంగా నిలిచాయి. కులవృత్తులకు ఆధునిక సొబగులు అద్ది అణగారిన వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చైతన్యాన్ని నింపుతున్నది. ముదిరాజ్, గంగపుత్రలకు ఏడాదంతా ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. గొల్ల కురుమలకు సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేసి వారి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసింది. నాయీబ్రాహ్మణులు, రజకుల వృత్తి పనిలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించి వారి వృత్తిని ప్రభుత్వం వెలిగించింది. కుమ్మరి/శాలివాహనులు, విశ్వబ్రాహ్మణులకు వృత్తిలో ఆధునిక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టి సదరు వృత్తులపై యువత ఉపాధి పొందే మార్గాన్ని వారి ముంగిటపెట్టింది. ఫలితంగా రాష్ట్రంలో అనేక వృత్తులు అంతరించిపోకుండా కేసీఆర్ సర్కార్ ఆకాశమంత ఎత్తున నిలిచేలా చేశారు. అటవీ ఆధారిత ఉత్పత్తులే జీవనాధారంగా చేసుకున్న ఆదివాసీ, గిరిజనుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది.
అంబేద్కర్ ఆలోచన.. కేసీఆర్ ఆచరణ
అంబేద్కర్ ఏ నిమ్నవర్గాల కోసం తన జీవితాన్ని ధారపోశారో ఆ వర్గాలు సమున్నత శిఖరాలకు చేరుకొనేలా చేసేందుకు కేసీఆర్ సర్కార్ కంకణం కట్టుకున్నది. ‘దళితులను కూలీలుగా పనులు చేయడం కోసం మా త్రమే పరిమితం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాం ట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించండి’ అని నాడు బ్రిటిష్ పాలకులను అంబేద్కర్ డిమాండ్ చేశారు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారత దేశంలో సాధ్యం కాని ఆ కలను.. సీఎం కేసీఆర్ తెలంగాణలో సాధించి చూపెట్టారు. ప్రభుత్వ దవాఖానల్లో పారిశుద్ధ్యం, రక్షణ (ఐహెచ్ఎఫ్ఎంఎస్), పోషకాహార (డైట్) ఏజెన్సీల్లో 16 శాతం దళితులకు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రాష్ట్రంలోని 28 దవాఖానల ఐహెచ్ఎఫ్ఎంఎస్, 28 దవాఖానల డైట్ ఏజెన్సీలను దళితులు దక్కించుకున్నారు. దళితులు అంటే రోజువారీ వర్కర్లు.. అనే భావనను చెరిపేస్తూ కాంట్రాక్టర్లుగా తలెత్తుకొని బతికేలా చేసింది సీఎం కేసీఆర్. 2018లో ప్రభుత్వ సివిల్ వర్క్స్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో వారి జీవితాలు మారిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 మంది ఎస్సీలు కాంట్రాక్టర్లుగా మారారు. 2021 నవంబర్లో మద్యం దుకాణాల్లో ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపులుండగా, ఇందులో 262 దళితులకు రిజర్వ్ అయ్యాయి.
ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీకలు
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కులసంఘాలు కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నది. ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతోపాటు వాటి నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. దేశ చరిత్రలో బీసీలు వారి ఆత్మగౌరవాన్ని చాటుకునేలా భవనాలు నిర్మించాలనే ఆలోచన సీఎం కేసీఆర్ మాత్రమే చేశారని ఆయా కుల సం ఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘సమాజం కులాల సముదా యం.. వృత్తుల సమాహారం. అందులో ఏ ఒక్క కులం, వర్గం నిరాదరణకుగురైనా దాని ప్రభావం సమాజం మీద పడుతుంది’ అనే గొప్ప ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. కులాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భవనాల నమూనాను ప్రభుత్వమే రూపొందించింది.
40 కులాలకు సమున్నత ఆత్మగౌరవ భవనాలు
బీసీల్లోని 40 కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి 82.30 ఎకరాల అత్యంత ఖరీదైన స్థలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు. ఈ భవనాల నిర్మాణం కోసం రూ.95.25 కోట్లను సైతం మంజూరు చేశారు. హెచ్ఎండీఏ రూ.10 కోట్లు ఖర్చు చేసి కుల సంఘాల వారీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది. అన్ని భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. దాదాపు అన్ని కులసంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ పూర్తిచేయగా, నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ఆత్మగౌరవ భవనాల్లో సమావేశ మందిరం, డైనింగ్హాల్, కిచెన్, గెస్ట్ రూమ్స్, దూరం నుంచి వచ్చే వారికి బస ఏర్పాట్లు వంటివాటితోపాటు ఆయా కులసంఘాల ప్రతినిధుల సూచనలకు అనుగుణంగా భవనాల నమూనాను రూపొందించటం విశేషం.
ఆదివాసీ, గిరిజన యోధుల స్ఫూర్తితో..
ఆదివాసీ హకుల కోసం పోరాడిన కుమ్రంభీం స్మారక కేంద్రాన్ని కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలోని జోడేఘాట్ వద్ద ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గోండు సంసృతిని తెలిపే మ్యాజియంను ప్రభుత్వం నెలకొల్పింది. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీం జిల్లాగా నామకరణం చేసింది.
మేడారం దగ్గర సమ్మక సారలమ్మ మ్యూజియం ఏర్పాటు చేసి, కోయ తెగ సంసృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నది. ఇందుకోసం రూ.22.53 కోట్లను సర్కారు ఖర్చుచేసింది. అలాగే హైదరాబాద్లో ఆదివాసీ, బంజారాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్లో సుమారు రూ.50 కోట్లు ఖర్చుచేసి కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవనాన్ని నిర్మించి సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నాయిబ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. 2.5 లక్షల నాయిబ్రాహ్మణ కుటుంబాలకు దీని వల్ల మేలు జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తమకు 50 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇందిరాపార్క్ వద్ద ధర్నాతో సమస్యలు చెప్పుకోవడానికి చేస్తే ‘మీ తోకలు కట్ చేస్తా’నని చంద్రబాబు హెచ్చరించిన రోజులకు సీఎం కేసీఆర్ మానవీయ స్పర్శకు ఉన్న తేడా తెలిసిపోయిందని నాయిబ్రాహ్మణులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు.
రజకవృత్తిదారులకు శారీరక కష్టాన్ని తగ్గించి, సాంత్వన కలిగించాలని సర్కార్ సంకల్పించింది. ఇందుకోసం ఆధునిక ధోబీఘాట్లకు శ్రీకారం చుట్టింది. మొదట్లో ఒక్కొక్క ధోబీఘాట్ను రూ.37.04 లక్షలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.52.04 లక్షలకు (హైదరాబాద్లో రూ.65 లక్షలు) పెంచింది. ఇందులో రూ.17 లక్షలు మిషనరీకి (ఉతికేందుకు, పిండేందుకు, ఆరవేసేందుకు అత్యాధునిక యంత్రాలకు) కేటాయించగా మిగిలిన మొత్తాన్ని సివిల్వర్క్స్(విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్, బోర్, మోటర్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఎలక్ట్రికల్, కాంపౌండ్వాల్)కు కేటాయించింది. అలాగే రజకుల లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. తద్వారా 2 లక్షల రజక కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది.
సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ పాత్రలు చేసే కుమ్మరి/శాలివాహన వృత్తిదారులకు ప్రభుత్వం నవీన నైపుణ్యాలను నేర్పిస్తున్నది. భూదాన్ పోచంపల్లిలోని రామానందతీర్థ ఇన్స్టిట్యూట్లో 350 మంది కుమ్మరి వృత్తిదారులకు ప్రభుత్వం వివిధ రకాల మట్టి పాత్రల తయారీలో శిక్షణ ఇప్పించింది. వీరు మరో 4వేల మందికి శిక్షణ ఇచ్చారు. వీరంతా గణపతి ప్రతిమలు, దీపెంతలు, మట్టి గ్లాసులు, జగ్గులు, వాటర్బాటిల్స్ తదితర మట్టిపాత్రల తయారీలో నిష్ణాతులు కావడమేకాకుండా ఉపాధిని పొందుతున్నారు.
కుమ్మరి వృత్తి కళాకారుల జీవన ప్రమాణాలు పెంచటంతోపాటు లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం మోడ్రన్ పాటరీ కిట్లను సబ్సిడీపై అందిస్తున్నది. శిక్షణ పూర్తి చేసుకొన్న 320 మంది కుమ్మరి వృత్తి కళాకారులకు ఆధునిక పాటరీ యంత్రాలను మంజూరు చేసింది. వీటి కొనుగోలుకు అయ్యే రూ.లక్ష ఖర్చులో రూ.80 వేలను ప్రభుత్వమే సబ్సిడీగా ఇచ్చింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేశవరం గ్రామంలో కుమ్మరి వృత్తిదారుల శిక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కుమ్మరి ఫెడరేషన్ పరిధిలో ఉన్న 2,076 కుమ్మరి/శాలివాహన సహకార సంఘాల్లోని దాదాపు 31వేల మందికి వృత్తిలో ఆధునిక నైపుణ్యాలు, యంత్రపరికరాల వినియోగం వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది.
ఆభరణాల తయారీలో తెలంగాణ విశ్వబ్రాహ్మణులది అందెవేసిన చేయి. బంగారం, వెండితో ఎన్నో రకాల నగలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర వీరికున్నది. వృత్తికి దూరమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశ్వబ్రాహ్మణ కళాకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బీసీ ఫెడరేషన్ , విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆభరణాల తయారీలో నూతన సాంకేతికతను ఉపయోగించి డై మేకింగ్, వాక్సింగ్మోడ్ తయారీ, స్టోనింగ్ తదితర అంశాల్లో ఆధునిక యంత్రాలతో శిక్షణనిస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయి.
ప్లాస్టిక్ వస్తువుల రంగప్రవేశంతో చాటలు, బుట్టలు తదితర వెదురు ఉత్పత్తులకు గిరాకీ తగ్గి సంక్షోభంలో కూరుకుపోయిన మేదరి కులవృత్తికి రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలను అందించింది. త్రిపుర నిపుణులతో మేదరి వృత్తిదారులకు వెదురుతో గృహాలంకరణ వస్తువుల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. చారిత్రక నిర్మాణాలు, కార్లు, బస్సులు, ఫ్లవర్వాజ్లు, ఫొటోఫ్రేమ్లు ఇలా మొత్తంగా 150 రకాల వెదురు వస్తువుల తయారీని నేర్పించి వారి నైపుణ్యాలను పెంచింది. శిక్షణ పొందిన కళాకారులు ప్రస్తుతం వెదురుతో కళ్లు చెదిరే కళాఖండాలను తీర్చిదిద్దుతూ గతం కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందుతున్నారు. అలాగే వెదురు ఉత్పత్తులకు సంబంధించి అమనగల్లులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
తెలంగాణ చొరవ దేశానికే ఆదర్శం
అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ. 125 అడుగుల మహా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కేవలం రాష్ట్రంలోని అంబేద్కరిస్టులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ లక్ష్యాల కోసం పనిచేస్తున్న వారికి స్ఫూర్తినిచ్చారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన కేసీఆర్ అభినందనీయులు.
– యూజీసీ మాజీ చైర్మన్ ఫ్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్
విగ్రహం చిహ్నం కాదు.. సందేశం
అంబేద్కర్ విగ్రహమనేది ఒక చిహ్నం కాదు. అదో సందేశం. కుటుంబాన్ని త్యాగం చేసి మరీ అంబేద్కర్ భవిష్యత్తు తరాల కోసం తాపత్రయపడ్డారు. ప్రస్తుతం అంబేద్కర్ను కొందరికి మాత్రమే పరిమితం చేసే కుట్ర జరుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషి అనిర్వచనీయం. అంబేద్కర్పై కేసీఆర్కు ఉన్న నమ్మకానికి నిదర్శనం.
– కాకి మాధవరావు, రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ
అంబేద్కర్ పేరిట అవార్డు
హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహం ఒక చరిత్రాత్మక, సాంస్కృతిక, విద్య, తాత్విక, వైజ్ఞానికమైన చెరుపలేని గుర్తు. వచ్చే పదేండ్లలో 200 దేశాల నుంచి పర్యాటకులు ఈ విగ్రహాన్ని చూసేందుకు భాగ్యనగరానికి వస్తారని గట్టిగా చెప్పగలను. దళితుల ఆత్మ గౌరవానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను తీసుకొచ్చారు. అంబేద్కర్ పేరిట రూ. 10 లక్షలతో ఓ అవార్డును ప్రదానం చేస్తే బాగుంటుంది.
-కత్తి పద్మారావు, దళిత మహాసభ వ్యవస్థాపకులు
నూతన శకానికి శ్రీకారం
సీఎం కేసీఆర్ ఆయన మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఒక నూతన శకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కేసీఆర్లోని రాజకీయ పరిణతినీ, సామాజిక, లౌకిక పాలనా విలువల దృక్పథాన్ని కూడా ముందుకు తీసుకొస్తుందని చెప్పాలి. అంబేద్కర్నూ, ఆయన ఆలోచనా విధానాన్ని విస్మరించి అఖండ భారతదేశాన్ని బాగు చేయలేమనే సముచిత సంకేతం కూడా ఈ ఆవిష్కరణ వెనుక ఉందని నా భావన.
-పీఎస్ఎన్ మూర్తి, ప్రముఖ అంబేద్కర్వాది
చరిత్రకు పాఠాలు చెబుతున్న కేసీఆర్
సీఎం కేసీఆర్ నిర్ణయంతో అంబేద్కరిజం పురివిప్పిన నెమలిలా మారనుంది. దేశంలో ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో ముందుకు వస్తున్న కేసీఆర్కు అంబేద్కర్వాదులు సహకరించాలి. కేసీఆర్ నిర్ణయం సామాజికశాస్త్రంలో నూతన కిరణజన్య సంయోగ క్రియగా అనాలి.
-ఢిల్లీ వసంత్, రైతు నాయకుడు, గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఎండీ
చార్మినార్లా గుర్తుంటుంది
మహా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, కొత్త సచివాలయానికి ఆయన పేరును పెట్టాలంటూ తీసుకొన్న నిర్ణయంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇంత ఎత్తులో ప్రపంచంలో మరెక్కడా అంబేద్కర్ విగ్రహం లేదు. దీంతో ఇప్పుడు ఈ వార్త ప్రపంచ దేశాల్లో చర్చకు వచ్చింది. హైదరాబాద్ అనగానే చార్మినార్ను ఎలా గుర్తుకు తెచ్చుకొంటారో.. ఇకపై, అందరూ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా అలాగే గుర్తుచేసుకొంటారు.
– డా. సిద్ధోజీరావు, కన్వీనర్ ఆఫ్ ఆఫీసర్స్ ఫోరమ్