హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్ఠించే గర్భగుడి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం ఆమె ట్వీట్ చేశారు.
‘అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ఠాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు’ అని ఆమె ట్వీట్ చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండటం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.