ఖమ్మం ఎడ్యుకేషన్, మే 13: ప్రణాళిక, పట్టుదలతో శ్రమి స్తే సర్కారీ కొలువు సాధించడం సులువేనని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన మీదే ఉంటుందన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు నిరుత్సాహ పడొద్దని, ఉత్సాహమే గెలుపునకు మొదటి మెట్టు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రకటనల నేపథ్యంలో.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ‘ఏం చదవాలి? ఎలా చదవాలి? భయాన్ని ఎలా తొలగించుకోవాలి?’ అనే అంశాలపై ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యాన రైట్ చాయిస్ అకాడమీ సౌజన్యంతో ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన బాలలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ప్రామాణికమైన మెటీరియల్ను ఎంచుకోవాలని సూచించారు.
వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, ఖమ్మం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ప్రముఖ సైకాలజిస్టు గంపా నాగేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్కుమార్, నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు మాట్లాడారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ‘పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి? ప్రామాణిక మెటీరియల్ను ఎలా ఎంపిక చేసుకోవాలి? సిలబస్ ఏమిటి? ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయి? వంటి విషయాల గురించి వక్త లు విపులంగా విశదీకరించారు. అభ్యర్థులు ‘నమస్తే తెలంగాణ’కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ ఖమ్మం బీఎం రేనా రమేశ్, బ్యూరో ఇన్చార్జి మాటేటి వేణుగోపాల్, ఎడిషన్ ఇంచార్జి కాయల పూర్ణచందర్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ‘నిపుణ’ ద్వారా ‘నమస్తే తెలంగాణ’ రూపొందించిన ‘తెలంగాణ ఉద్యమ చరిత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.