హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రం జలసిరులు సంతరించుకున్నది. భూగర్భ జలాలు అమాంతం పెరగడంతో చేతికి అందేంత ఎత్తులోకి భూగర్భ జలాలు వచ్చేశాయి. జూన్ నెలతో పోలిస్తే జూలైలో రాష్ట్ర సగటు నీటిమట్టం 2.50 మీటర్లు పెరిగి 6.17 మీటర్లకు చేరుకుంది. మెదక్లో గరిష్ఠ నీటమట్టం 11.67 మీటర్లుగా ఉండగా, జగిత్యాలలో 2.84 మీటర్ల లోతులోనే ఊట కనిపిస్తున్నది. భూపాలపల్లిలో జూలైలో భూగర్భ జలమట్టం గరిష్ఠంగా 1.25 మీటర్లు పెరగ్గా, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠంగా 0.01 మీటర్లు పెరిగింది. సరాసరి నీటిమట్టం 4.97 మీటర్ల నుంచి 13.55 మీటర్లుగా నమోదైంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 14 జిల్లాలో సరాసరి నీటిమట్టం 5 మీటర్ల కంటే తక్కువగా, 17 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లులోపు, 2 జిల్లాల్లో 10 మీటర్లుగా ఉంది. గత పదేండ్ల జూలై నెల భూగర్భ జలమట్టాల సరాసరితో పోలిస్తే 612 మండలాలకు గాను 569 మండలాల్లో 0.22 నుంచి 13 మీటర్లు పెరిగింది. 43 మండలాల్లో 0.01 నుంచి 15.77 మీటర్ల వరకు తగ్గుదల కనిపించినట్టు పేర్కొంటూ భూగర్భ జలవనరులశాఖ మంగళవారం నీటిమట్టాల నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,718 బావులను పరిశీలించి దీనిని రూపొందించింది. సగటున 20 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్టు పేర్కొంది.