హుజూరాబాద్ టౌన్, జూలై 16: హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మోటర్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యుల కోసం ఐదెకరాల స్థలంలో సకల వసతులతో ఆటోనగర్ను నిర్మించి ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ అతిథి గృహంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని మోటర్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి మంత్రి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. 350 మంది మోటర్ ఫీల్డ్ వర్కర్స్ కోసం సువిశాల స్థలంలో అన్ని వసతులతో ఆటోనగర్ ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. దీంతోపాటు అక్కడ దుకాణ సముదాయం నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా ఉండి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హుజూరాబాద్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మంత్రిని కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఏంచేస్తాడు?
ఏడేండ్లు మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని అభివృద్ధిని, ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఈటల రాజేందర్ ఎలా చేస్తాడో హుజూరాబాద్ ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీశ్రావు కోరారు. ఈటల తప్పుడు నిర్ణయం వల్లే ప్రజలపై ఎన్నికల భారం పడిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓటును టీఆర్ఎస్కు వేసి ఈటలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
టీఆర్ఎస్కే మా మద్దతు
టీఆర్ఎస్లో పదవులన్నీ అనుభవించిన ఈటల స్వార్థం కోసమే పార్టీ మారిండని, ఈటలవన్నీ దొంగేడ్పులేనని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వాసాల రామస్వామి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మికుంట మండలం శంభునిపల్లిలో గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామస్థులు తీర్మానించారు.