నల్లగొండ, డిసెంబర్ 11 : తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఈ ఎనిమిదేండ్లలో దేశంలోనే తెలంగాణ ఆర్థికంగా ఎదిగి పుష్కలంగా ఆర్థిక వనరులు సంపాదించుకున్నదని తెలిపారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ దినపత్రికల ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండలోని నాగార్జున కళాశాల ఆవరణలో నిర్వహించిన ఆటోషోకు రెండో రోజైన ఆదివారం విశేష స్పందన లభించింది. ముగింపు సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆటోషోలో పాల్గొని పలువురు కొనుగోలుదారులకు వాహనాలను, లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరిగిన నేపథ్యంలో అవసరాల కోసం ప్రతి వ్యక్తి వాహనాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఆటో మొబైల్ రంగం బాగా పుంజుకున్నందునే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ జరుగుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్ల విస్తరణతోపాటు మెట్రో సర్వీసులు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టిసారించి నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆటోషో ముగింపు రోజు 19 కంపెనీల కు సంబంధించిన బైక్లు, కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉం చగా కొనుగోదారులు పెద్ద ఎత్తున రావటంతో ఆయా కంపెనీలు వాహనాలు బుకింగ్ చేసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చాయి.
రెండో రోజు కూడా ఇద్దరు విజిటర్లు, ఒక డీలర్కు లక్కీ డ్రా ద్వారా కేఫ్ నిలోఫర్ సహకారంతో బహుమతులు అందజేశారు. సందర్శకులు, కొనుగోలుదారులకు కలిపి బంపర్ డ్రా కింద స్మార్ట్ఫోన్ బహూకరించారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో 12 కార్లు, 11 బైక్లు అమ్ముడయ్యాయి. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నమస్తే తెలంగాణ బ్రాంచి మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి మడూరి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్రెడ్డి, అడ్వైర్టెజ్మెంట్ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మారగోని మల్సూర్గౌడ్, ప్రొడక్షన్ ఇన్చార్జి తూముల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.