హైదరాబాద్ సిటీబ్యూరో/బొంరాస్పేట జనవరి 19 (నమస్తే తెలంగాణ): గిరాకీ లేక.. ఆటో నడవక.. అప్పులు తీర్చలేక హైదరాబాద్ నగరంలో మరో ఆటో డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా బాపల్లితండాకు చెందిన రాహుల్ అనే యువకుడు గురువారం సాయంత్రం నగరంలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బామినీ బాయి, బాలూనాయక్ల కుమారుడైన రాహుల్ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతని మరో ఇద్దరు సోదరులు జొమాటోలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చిన రాహుల్ బండ్లగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని షేరింగ్ పద్ధతిన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఎనిమిది నెలల క్రితం అప్పుచేసి, ఆటో కొనుగోలు చేశాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాహుల్ నెలవారి వాయిదాలు చెల్లిస్తూ అప్పు తీర్చుతున్నాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటోలను ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. గిరాకీ లేక రోజుకు కనీసం పెట్రోల్, గ్యాస్ డబ్బులు సైతం మిగలకపోవడంతో రాహుల్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఒకపక్క ఆటో కోసం చేసిన అప్పు తీర్చలేక, మరోపక్క కుటుంబ పోషణ భారమై గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొట్టకూటి కోసం ముంబాయి వెళ్లిన తల్లిదండ్రులు చిన్నకుమారుడైన రాహుల్ మరణ వార్త తెలుసుకుని భోరున విలపిస్తూ స్వగ్రామానికి చేరుకున్నారు.