జడ్చర్లటౌన్, జూలై 23 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పత్తిమార్కెట్ యార్డులో బాదేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అన్నదాతలకు న్యాయం చేయాలని కోరుతూ రైతులతోపాటు బీఆర్ఎస్ నాయకులు గురువారం కలెక్టర్ కుష్బూగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. జడ్చర్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మక్కజొన్న రైతుల వద్ద బాదేపల్లి పీఏసీఎస్, మార్క్ఫెడ్ సంయుక్తంగా మక్కలు కొనుగోలు చేశారని, ఈ క్రమంలో రైతుల నుంచి ప్రతి 50 కిలోల బస్తాకూ 52 కిలోల తూకం వేశారని పేర్కొన్నారు. అదే విధంగా రైతుల నుంచే గోనె సంచులను కొనుగోలు చేయించినట్టు తెలిపారు.
అంతేగాక ట్రాన్స్పోర్ట్, హమాలీల డబ్బుల భారాన్ని రైతులపైనే వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు నెలల తర్వాత మక్కల డబ్బుల చెల్లింపులో కోత విధించారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులు అమ్మిన మక్కలకు మార్క్ఫెడ్ చెల్లించిన డబ్బులకు వ్యత్యాసం ఉన్నదని, దీనిపై పీఏసీఎస్, మార్క్ఫెడ్ అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా రైతులపైనే దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు. మక్కజొన్న కొనుగోలులో అక్రమాలపై మహబూబ్నగర్ ఆర్డీవో, జడ్చర్ల తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన పీఏసీఎస్ చైర్మన్, సీఈవోలపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు.