Farmers | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : కరువు ప్రభావం గ్రామాలపై తీవ్రంగా పడింది. సాగునీరందక కండ్లెదుటే పంటలు ఎండిపోవడంతో చేసేది లేక కూలీలతో పాటు రైతులు సైతం ఉపాధి హామీ పనులకు పోవాల్సి వస్తున్నది. మూడేండ్లలోనే గత ఏప్రిల్లో అత్యధిక కూలీలు ఉపాధి పనులకు రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. యాసంగి పంటలు అంతంతే పండడం, సరైన పనులు దొరక్కపోవడంతో కూలీలకు, రైతులకు ఉపాధి పనులే దిక్కవుతున్నాయి. ఏప్రిల్ లక్ష్యం 2.25 కోట్ల పనిదినాలైతే అదే నెలలో 3.26కోట్ల పనిదినాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంచనాలకు మించి మరో కోటి పనిదినాలు పెరగడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే 18.18 లక్షల మంది కూలీలు పనికి రాగా, మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
రాష్ర్టానికి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం 8కోట్ల పనిదినాలు కేటాయించిందని, ఏప్రిల్ నాటికే 3.26కోట్ల పనిదినాలు పూర్తయ్యాయని, జూన్ మధ్యకల్లా మొత్తం పూర్తవుతాయని భావిస్తున్నారు. ఎక్కువ మంది కూలీలు పనులకు వస్తుండటంతో మస్టర్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దీని ద్వారావెంటనే కూలి మొత్తం వారి అకౌంట్లలో జమవుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి సాగునీరు అందించకపోవడంతో ఇక నీళ్లు వస్తాయో రావోనన్న అనుమానంతో రైతులు లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. వేసిన చోట నీళ్లందక పంటలు ఎండిపోయాయి. దీంతో వ్యవసాయ, అనుబంధ పనులు తగ్గిపోయి ఆ ప్రభావం వ్యవసాయ కూలీలపై పడింది.
మార్చి వరకు ఇతర పంటల పనులు చేసినా అవన్నీ పూర్తి కావడంతో ఏప్రిల్ నుంచి ఉపాధి హామీ వైపు మళ్లారు. దీనికి తోడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రతి గ్రామంలో జాబ్ కార్డుల ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించి కూలీలకు పనులు చూపాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో కూలీలు ఉదయాన్నే పనులకుపోతుండటంతో గ్రామాలు బోసిపోతున్నాయి. ఉపాధి హామీ పనులు జరిగే చోటుకే లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు వెళ్తున్నారు. పల్లెల్లో వ్యవసాయం ఎంతగా దెబ్బతిన్నదో ఈ దుస్థితిని చూస్తే తెలుస్తుందని పలు రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.