TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల నుంచి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 పేపర్ కోసం జూన్ నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టి, అక్టోబర్ మొదటి వారంలో పేపర్ను అపహరించినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. పేపర్ లీకేజీ ఘటనలో 9 మంది నిందితులను మూడో రోజు సిట్ అధికారులు విచారించి, పలు ప్రశ్నలపై సమాధానాలు రాబట్టారు. మొదటి రెండు రోజులు ఒక్కొక్కరిని, ఇద్దరిద్దరిని కలిపి విచారించిన సిట్, మూడో రోజు కొద్ది సేపు అందరినీ కలిపి విచారించింది. ప్రధాన నిందితుల నుంచి రేణుక, డాక్యా దంపతులకు పేపర్ అందిన తరువాత ఆమె సోదరుడైన రాజేశ్వర్ ద్వారా కానిస్టేబుల్ శ్రీనివాస్ను ఎప్పుడు సంప్రదించారు? శ్రీనివాస్ ద్వారా గోపాల్నాయక్, నీలేశ్నాయక్లకు ప్రశ్నాపత్రం ఎప్పుడు అందించారు? వారిద్దరిని పరీక్ష కోసం ఎక్కడ సిద్ధం చేశారు? అనే విషయాలపై నిందితులను ఉమ్మడిగా విచారించారు.
ప్రవీణ్, రాజశేఖర్లను మరోసారి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు సోమవారం తీసుకెళ్లారు. పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మి తన డైరీలో పాస్వర్డ్ రాసుకోవడంతో దానిని అపహరించామని ముందుగా నిందితులు చెప్పారు. శంకరలక్ష్మి తన వాంగ్మూలంలో ఎక్కడ కూడా పాస్వర్డ్ రాసిపెట్టలేదని వెల్లడించడంతో పోలీసులు ఈ విషయంలో స్పష్టత కోసం సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ను ప్రత్యేకంగా విచారించారు. కస్టోడియన్ సిస్టమ్తోపాటు మరికొన్ని కంప్యూటర్లు లాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్)లో ఉండటం, ఆ సిస్టమ్స్ ఐపీలు అడ్మిన్ రాజశేఖర్ వద్ద ఉండటంతో సునాయసంగా ఆమె సిస్టమ్ను ఓపెన్ చేసినట్టు వెల్లడించాడు. కస్టోడియన్ కార్యాలయంలోని ప్రశ్నాపత్రాలు ఉన్న కంప్యూటర్ వద్దకు ఎవరూ వెళ్లేందుకు వీలుండదు. కస్టోడియన్ లేని సమయంలో రాజశేఖర్ అందులోకి వెళ్లి ఆమె కంప్యూటర్ను ఆన్చేసి, లాన్లో తన కంప్యూటర్ ద్వారా ఓపెన్ చేసినట్టు వెల్లడించినట్టు సమాచారం.
సిస్టమ్లో సీక్రెట్గా ఉండాల్సిన ఫోల్డర్లకు పటిష్టమైన భద్రతాఏర్పాట్లు చేసుకోకపోవడం, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్కు అన్ని అంశాలపై అవగాహన ఉండటంతో ఈజీగా ఓపెన్ చేసినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఫిబ్రవరి 27నే కాకుండా పలుమార్లు ఆమె కంప్యూటర్ను రాజశేఖర్, ప్రవీణ్లు ఓపెన్ చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. ప్రశ్నాపత్రాలుండే కస్టోడియన్ సిస్టమ్ గురించి పూర్తి అవగాహన ఉండటంతో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ గత ఏడాది జూన్ నుంచే గ్రూప్-1 ప్రశ్నాపత్రం కోసం ప్రయత్నించాడు. అప్పటికి ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో తిరిగి రెండు మూడు దఫాలుగా ప్రయత్నించి, అక్టోబర్ మొదటి వారంలో పేపర్ను పెన్డ్రైవ్లోకి కాపీ చేసినట్టు తెలిసింది. అది విజయవంతం కావడంతో ఫిబ్రవరి 27న మరోసారి ఆ సిస్టమ్ను ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఉన్న మొత్తం ప్రశ్నలను కాపీ చేశానని నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. మరో పక్క ప్రవీణ్, రాజశేఖర్ ఇండ్లల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. వారి బ్యాంకు స్టేట్మెంట్లు సేకరించారు. మరో మూడు రోజులపాటు నిందితులు సిట్ కస్టడీలోనే ఉండనున్నారు.
కుల్కచర్ల, మార్చి 20: వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ డాక్యానాయక్ను విధుల నుంచి తొలగిస్తూ డీఆర్డీవో ఉత్తర్వులు జారీచేసినట్టు ఎంపీడీవో నాగవేణి తెలిపారు. డాక్యానాయక్.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పంచంగాల్తండాలోని అతని కుటుంబసభ్యులకు ఈ ఉత్తర్వులు అందించినట్టు ఆమె వివరించారు. ఇప్పటికే ఏ3గా ఆయన భార్య రేణుక డాక్యానాయక్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.