హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రశ్నించే గొంతుకలపై దాడి అప్రజాస్వామికమని సెంటర్ ఫర్ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజాపాలన తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలు, పాత్రికేయులపై భౌతిక దాడులకు దిగుతూ అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు ను ఎత్తిచూపిన జర్నలిస్టు శంకర్పై దాడిని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. భావ స్వేచ్ఛను అణచివేయాలని చూడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ఎమర్జెన్సీ, నిర్బంధాలు వంటివి కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉన్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ గతానికి వర్తమానికి ఏమాత్రం తేడా లేదని ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జర్నలిస్టు శంకర్పై దాడికి కొన్నిరోజుల క్రితమే చిలుక ప్రవీణ్, రంజిత్, ఆకుల ప్రవీణ్, మరో జర్నలిస్టు శ్రీనివాస్రెడ్డి తదితరులకు బెదిరింపు ఫోన్స్ కాల్స్ వంటి దృష్టాంతాలను ఏకరువు పెడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా? అని ఆయన ప్రశ్నించారు.