Farmers | వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదే లేదని, తమ బతుకంతా ఈ భూముల మీదే ఆధారపడి ఉన్నదని కొడంగల్ మండలం అప్పాయిపల్లి అసైన్డ్ రైతులు తేల్చి చెప్తున్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పారామెడికల్ కాలేజీ నిర్మాణానికి అప్పాయిపల్లిలోని సర్వే నంబర్ 19, 20లోని 47 మంది రైతుల 75.17 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అప్పాయిపల్లి అసైన్డ్దారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఏ ఒక్క రైతు కూడా భూములిచ్చేందుకు ముందుకు రావడం లేదు.
ఎకరానికి 10 లక్షల పరిహారం, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్తు న్నా రైతులు మాత్రం తమ బతుకులను ఆగం చేయొద్దని వేడుకుంటున్నారు. భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఈ భూముల మీదే ఆధారపడ్డామని అంటున్నారు. భూములిచ్చి మన్ను బుక్కాల్నా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాము అభివృద్ధికి అడ్డు కాదని తెలిపారు. గుట్టలు, గుంతలుగా ఉన్న బీడు భూములను సాగులోకి తెచ్చుకున్నామని, బలవంతంగా భూములను లాక్కుంటే ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. చెప్రాసీ ఉద్యోగాలు తమకు వద్దని, భూమితోనే తమ బతుకు అని స్పష్టం చేస్తున్నారు.
మాకు 1.20 ఎకరాల భూమి ఉన్నది. 40 ఏండ్లుగా ఈ భూమి మీదే ఆధారపడి బతుకుతున్నం. నేను పీజీ వరకు చదువుకున్నా. ఏ ఉద్యోగం లేక వ్యవసాయం చేసుకుంటున్నం. మేం అభివృద్ధికి అడ్డుకాదు. కానీ మమ్మల్ని ఏం చేసినా భూములివ్వం. ఇంకా ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న భూములుంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. బలవంతంగా భూములు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎకరానికి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. మాకు పైసలొద్దు సారూ! జీవితాంతం బతుకుదెరువు కావాలి.
– దొబ్బిల పకీరప్ప
మా నాయన నన్ను నారాయణపేట జిల్లాలోని పేదింటికి ఇచ్చిండు. మా పరిస్థితి చూసి ఇక్కడ్నే ఉండుమని రెండెకరాల భూమి బహుమతిగా ఇచ్చిండు. 30 ఏండ్లుగా పంటలు వేసుకుంటున్నం. మేం సచ్చిపోతే శవాలు పెట్టనీకే జాగా లేదు. మాకు గీ జాబులొద్దు. మా భూములే మాక్కావాలి. మాకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నడు. ఈ భూమి మీదనే ఆధారపడి బతుకుతున్నం. మమ్మల్ని ఏం చేసినా భూములివ్వం.
– మోతీబాయి, అప్పాయిపల్లి
మాకు రెండెకరాల భూమి ఉన్నది. కందులు, పత్తి పండించుకుంటా బతుకుతున్నం. ఈ భూమే మా కుటుంబానికి దిక్కు. అప్పట్లో రోడ్డు వస్తే కొంత భూమి తీసుకున్నరు. ఇప్పుడు ఉన్న భూమి తీసుకుంటే రోడ్డున పడ్తం. ప్రాణాలు తీసినా మా భూములు ఇవ్వం.
– బువ్వ బుగ్గప్ప, అప్పాయిపల్లి
మాకు రెండెకరాల భూమి ఉన్నది. కొన్నేండ్లుగా పంటలు పండించుకుంటూ బతుకుతున్నం. ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లను ఈ భూమి ఆధారపడే నడుపుతున్నాం. రెండు నెలల కింద మా ఇంటాయన చనిపోతే ఈ భూమిలోనే కాష్టం చేసినం. మా అత్త, మామ బొందలు కూడా ఈడనే ఉన్నాయి. భూములిస్తే మా కుటుంబం ఆగమైతది, ఎట్ల బతకాలి? ప్రభుత్వం ఇచ్చే పైసలు ఎన్ని రోజులుంటాయి? భూతల్లి ఉంటేనే పంట చేసుకొని బతుకుతం. భూములివ్వాలని వెంట పడుతున్నారు. భూములిచ్చి ఎక్కడికి పోవాలి? ఏం తినాలి?
– అగ్గనూరు నర్సమ్మ, అప్పాయిపల్లి