హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): వయోవృద్ధుల సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా నిలుస్తున్న తెలంగాణ సర్కారు మరో పెను సామాజిక విప్లవానికి నాంది పలికింది. వృద్ధులకు భరోసా కల్పించేందుకు దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం-2011లో పలు కీలక మార్పులు చేసింది. సంరక్షణను పట్టించుకోని తమ పిల్లల నుంచి ఇప్పటి వరకు గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తులనే తీసుకొనే అవకాశం ఉండగా, తాజా గా ఇకపై రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులనూ తిరిగి తమ పేరిట బదలాయించుకునేలా చట్టాన్ని సవరించింది. అదీగాక ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ఆర్డీవోలకు అధికారాలను కట్టబెట్టింది.
వయోవృద్ధుల కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్ 14567 సేవలకు 2019లో శ్రీకారం చుట్టింది. ఆ హెల్ప్లైన్కు వచ్చిన కాల్స్ను విశ్లేషించగా 46 శాతం మంది వృద్ధ మహిళలు, 54 శాతం మంది వృద్ధ పురుషులు వేధింపులకు గురవుతున్నట్టు గుర్తించింది. మొత్తం కాల్స్లో 39 శాతం నిరాదరణకు, 18 శాతం ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నామని ఆశ్రయిస్తున్నవేనని అధికారులు గమనించారు. వృద్ధులను వేధింపులను గురిచేస్తున్న వారిలో కొడుకులు 56 శాతం, కోడళ్లు 13 శాతం, కూతుళ్లు 7 శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది.
ఆస్తి లాక్కొని తల్లిదండ్రులను గెంటేస్తున్నవారున్నారు..
తిండి పెట్టకుండా నరకం చూపించిన కొడుకులున్నారు..
సూటిపోటి మాటలతో క్షోభకు గురిచేసినవారున్నారు..
అంత్యక్రియలకు కూడా రాని కఠినాత్ములున్నారు..
వీళ్లందరికీ గడ్డి పెట్టేలా, వృద్ధులకు ఊతమయ్యేలా..
తెలంగాణ సర్కారు పెను విప్లవానికి నాంది పలికింది!
ఆస్తులను వెనక్కి తీసుకొనే చట్టం తెచ్చి చరిత్ర సృష్టించింది!!
కొడుకులు, కూతుళ్లను దారిలో పెట్టే బాధ్యత తీసుకొన్నది!!!
వృద్ధులు సంతోషకరమైన జీవనాన్ని గడిపేందుకు కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం చేపడుతున్నది. వృద్ధుల భద్రత, సంక్షేమం, హకుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే హెల్ప్లైన్ను ఏర్పాటు చేయడంతోపాటు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్స్ సిటిజన్స్ చట్టంలో పలు సవరణలు చేసింది. వృద్ధులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. హెల్ప్లైన్పై, చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి.
– పార్థసారథి, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజెన్స్ కౌన్సిల్ సభ్యుడు
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వృద్ధులు ఎవరి నుంచి, ఏవిధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా సంప్రదించాలి. ప్రతి ఒక్కరు వృద్ధులను ప్రేమతో చూడాలి. వృద్ధులను ఇబ్బందికి గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదు. -కమిషనర్ శైలజ