హైదరాబాద్: పోడుభూముల పంపిణీ, వీఆర్ఏల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రైతు రుణమాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో విపక్షాలు తట్టుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కీలక నిర్ణయాల వల్ల ప్రతిపక్షాలకు (Opposition parties) ఏంమాట్లాడాలో తెలియడం లేదన్నారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలతో విపక్షాల గొంతు మూగబోయిందని, వారికి ఓ వాయిస్ అంటూ లేకుండా పోయిందని విమర్శించారు. బయటే కాదు అసెంబ్లీలో కూడా విపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లాబీల్లో మంత్రి హరీశ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
నల్లగొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయని చెప్పారు. రాజకీయ పార్టీల్లో అంతర్గత కలహాలు సహజం అన్నారు.
కాంగ్రెస్, బీజేపీల వద్ద డబుల్ బెడ్ రూమ్ అంశం తప్ప మరో అంశం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన తర్వాత గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. కొంతమండి మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే మీడియా సంస్థ ప్రారంభిస్తానని, తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తానని వెల్లడించారు. ఏది జరిగినా అంతా మన మంచికేనని అనుకుంటానన్నారు.