హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ‘మూడేండ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేశారా? అని జలాశయాలను నిర్మించారా? ఎలా సాధ్యమైంది?’ అంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంపై అస్సాం రాష్ట్ర అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సంకల్పం, ప్రగతి స్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలోని పలు నీటిపారుదల ప్రాజెక్టుల అధ్యయనానికి అస్సాం ఇరిగేషన్శాఖ అధికారుల బృందం రాష్ర్టానికి విచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను సందర్శించింది. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను, పంప్హౌజ్లను అధికార బృందం పరిశీలించింది.
అస్సాం అధికారులకు ఆయా ప్రాజెక్టులు, జలాశయాల నిర్మాణ విశేషాలను, ఆవశ్యకతలను గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ వివరించారు. ఈ సందర్భంగా అస్సాం ఇంజినీర్లు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆయా జలాశయాల్లో నదీజలాలను చూసి మైమరచిపోయారు. ప్రపంచంలో ఇంత అతిపెద్ద, అత్యద్భుత ఎత్తిపోతల పథకం ఎక్కడా లేదని, ఇంతటి భారీ ప్రాజెక్టును మూడేండ్ల అతి స్వల్ప కాలంలో పూర్తి చేయడం అమోఘమంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో దీక్షతో చేస్తే తప్ప ఈ అద్భుతం సాధ్యం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇంజినీర్ల నైపుణ్యం అదుర్స్
గొప్ప ప్రాజెక్టును ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్ల నైపుణ్యం బాగున్నదని అస్సాం అధికారులు కొనియాడారు. తమ రాష్ర్టానికి విచ్చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించి, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈఎన్సీ హరిరామ్ను ప్రత్యేకంగా ఆహ్వానించా రు. అనంతరం సిద్దిపేట కోమటి చెరువును సైతం అస్సాం అధికారులు సందర్శించారు. చెరువు అందాలను వీక్షించి మంత్ర ముగ్ధులయ్యారు. ఈ ప్రాంతం లో ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలే దర్శనమిస్తున్నాయని కితాబిచ్చారు. ప్రాజెక్టులను సందర్శించినవారిలో అస్సాం ఇరిగేషన్ శాఖ డిప్యూటీ సెక్రటరీ అరూప్కుమార్ శర్మ, చీఫ్ ఇం జినీర్ ధీరజ్సైకియా, మేజర్ ఇరిగేషన్ డిజైన్ డైరెక్టర్ నబా బయాన్, మైనర్ ఇరిగేషన్ డిజైన్ డైరెక్టర్ రహమాన్, ఇతర ఇంజినీర్లు తదితరులున్నారు.