కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల ఈ గిరిజన ప్రాంతాల్లో 10-15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలిసిందన్నారు. అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
మావోయిస్టుల కార్యకలాపాలకు యువత ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవాలని, ప్రభుత్వం జిల్లాలో ఉచిత విద్య, ఉచిత హాస్టల్ సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్థానికులు ఎస్పీ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. మీ కోసం కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అధికారులతో చర్చించి, మీ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రతి మారుమూల ప్రాంతాల్లో పోలీసులు అందుబాటులో ఉంటున్నారని, అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. లేదా డయల్ 100కు కాల్ చేసి తెలుపాలని కోరారు. తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల చిన్న పిల్లలకు బిస్కెట్లు, స్వీట్లు అందించారు .
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, రెబ్బెన సీఐ నరేందర్, తిర్యాని ఎస్ఐ రమేశ్, తాటిగుడ సర్పంచ్ గణపతి, పటేల్స్ అంబరావు, బారిక్ రావు, మోతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.