Asha Workers | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో తేదీనే వేతనాలు అందుకునే ఆశావర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రెడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28 వేల ఆశావర్కర్లు సేవలు అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వీరు నియమితులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని పనులకు వీరినే పురమాయిస్తున్నది.
ఇంతా చేస్తే వీరికి ఇచ్చేది నెలకు రూ. 9,700 వేతనం మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఇప్పటి వరకు అంటే డిసెంబర్, జనవరి వేతనాలు వీరికి ఇప్పటి వరకు అందలేదు. వేతానాలివ్వండి మహాప్రభో అని సంబంధితశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కమిషనర్, డైరెక్టర్కు వినతిపత్రాలు కూడా అందించినా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. మూడు రోజుల క్రితం నగరంలోని 1800 మంది ఆశా వర్కర్లు హైదరాబాద్ డీహెచ్ఎంవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం సమర్పించారు. పలుచోట్ల సంబంధిత పీహెచ్సీ వైద్యులకు సమ్మె నోటీసు ఇస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడుతున్నట్టు ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షురాలు జయలక్ష్మి తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆమె హెచ్చరించారు.