Aasara Pension | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 9 (నమస్తేతెలంగాణ): ఎట్టకేలకు ఆసరా లబ్ధిదారులకు పింఛన్ అందింది. శుక్రవారం ఉదయమే నగదు ఖాతాల్లో జమైంది. ‘పింఛనో రామచంద్ర’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి సర్కార్ స్పందించింది. వెంటనే రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ బాధితుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమచేసింది.
అయితే డిసెంబర్, జనవరి రెండు నెలల పింఛన్లు రావాల్సి ఉండగా, డిసెంబర్ నెల పింఛన్లనే సర్కారు వేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 1,20,862 మంది లబ్ధ్దిదారులకు రూ.26,53,65,712 ఒక్కరోజే బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. కొద్దిరోజులుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు నగదు జమకావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తమ గోడును సర్కారు దృష్టికి తీసుకెళ్లిన ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.