ఖలీల్వాడి, ఏప్రిల్ 22: తాను బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి, బీజేపీలోకి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వీడను, బీజేపీ సహా మరే పార్టీలో చేరనని స్పష్టంచేశారు. కంఠంలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్ బాట వీడనని, చివరివరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని చెప్పారు. తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని తెలిపారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే ఈ దుష్ప్రచారం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో చేరడానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కలిసినట్టు కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ మంత్రిని కలువలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.