Monsoon | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు వెల్లడించింది. రెండు, మూడు రోజుల్లో అవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. మూడు రోజులు ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ర్టానికి ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్ర ప్రకటనతో రైతన్నలు సాగుకు సమాయత్తం కానున్నారు.