TSRTC | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా సోమవారాలపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రోజు వివిధ పనులపై ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో ప్రతివారం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్)ను భారీగా పెంచడం ద్వారా ఆదాయం అధికంగా వచ్చేలా ప్లాన్ చేసింది. గత సోమవారం ప్రయోగాత్మకంగా చేసిన కసరత్తు సత్ఫలితం ఇవ్వడంతో ఇక నుంచి ప్రతివారం అమలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. డిపోల్లో ఉన్న అదనపు బస్సులన్నింటినీ రోడెక్కించడంతో పాటు వీలైనంత వరకు సిబ్బంది సెలవుల్లో లేకుండా చూస్తున్నారు. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించారు.
15న రికార్డు స్థాయిలో ఆదాయం
ఆర్టీసీకి టికెట్ల రూపంలో ఈ నెల 15న సోమవారం రోజున రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. ఏడాది కాలంలో సంక్రాంతి ముగిసిన మర్నాడు, హోలీ రోజులోనే ఇలా రూ.20 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. కానీ ఎలాంటి పండుగ లేకున్నా సాధారణ రోజునే అధికాదాయం రావడం ఆర్టీసీ చరిత్రలో రికార్డే. టార్గెట్ను మించి 116 శాతం ఆదాయం నమోదు కావడం, ఆక్యుపెన్సీ రేషియో 79.33 శాతంగా నమోదు కావడం విశేషం. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో దాదాపు రూ.3 కోట్లకు పైగానే అదనపు ఆదాయం వచ్చింది. ఆరోజు రాష్ట్రంలోని 96 డిపోలకు గాను ఏకంగా 73 డిపోలు లాభాలను ఆర్జించాయి.