నిజామాబాద్ : జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల మంజూరుకు తన వంతుగా కృషి చేశానని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, వేల్పూర్ మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మాధవనగర్ ఆర్వోబీ మంజూరు చేయించానని తెలిపారు.
మిగతా ఆర్వోబీల మంజూరికి కేంద్ర మంత్రికి, రైల్వే బోర్డుకు పలుమార్లు లేఖలు రాశానని వెల్లడించారు. ఆర్వోబీలకు నిధులు మంజూరు చేయించానని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అయిపోతుంది అనే భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. జిల్లా మంత్రిగా ప్రతిపాదనలు చేసిన మిగతా నాలుగు ఆర్వోబీలకు కేంద్రం నుంచి మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.మాధవనగర్ ఆర్వోబీకి రాష్ట్ర ప్రభుత్వం 63 కోట్లు ఖర్చు చేస్తుండగా రైల్వే శాఖ రూ. 30 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేపట్టిన పనులు రెండు నెలల క్రితమే ప్రారంభం అయ్యాయని,రైల్వే తరుపున పనులు ఇంకా ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. పొరపాటున ఎంపీగా అరవింద్ను గెలిపిస్తే ప్రజలకు కేంద్రం నుంచి నయాపైసా సాయం చేయలేదని ఆరోపించారు. పేద ప్రజల వైద్య ఖర్చుల కింద సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు, పీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు ఆర్ధిక సహాయం చేయాలని సూచించారు.ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్న అరవింద్ మాటాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.