ఏఐని ప్రజలు నమ్మితేనే దాని వినియోగం సాధ్యం
ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం కలిగించాలి.. డబ్ల్యూఈఎఫ్ చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ వినియోగంతో కలిగే లాభ నష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా మంగళవారం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్-మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్కేర్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ప్రజల నమ్మ కం పొందడమే ప్రభుత్వాలకు అతిపెద్ద సవాల్ అని తెలిపారు. డాటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఈ టెక్నాలజీని నిఘా కార్యకలాపాలకు ఉపయోగించబోమన్న భరోసా ప్రజలకు కల్పించాలని సూచించారు.
సరైన పద్ధతుల్లో వాడితేనే సత్ఫలితాలు
ఆధునిక సాంకేతికతను సరైన పద్ధతిలో వాడినప్పుడే సరైన ఫలితాలు వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ విభాగాల నియంత్రణ అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఈ టెక్నాలజీలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. పార్లమెంటరీ విధానంలో ఈ అధికారాలను పారదర్శకంగా ప్రభుత్వ విభాగాలకు కల్పించాలని పే ర్కొన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరస్థులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడానికి పో లీసులకు శ్రమ తగ్గుతుందని తెలిపారు. చర్చలో జపాన్ ఎన్ఈసీ ప్రెసిడెంట్ తకాయుకి మోరిటా, ఎంజీ నికోల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉషాహిదీ ఓడీ, ఎడ్జ్ టెక్ సీఈవో ఓస్ట్రోమ్ పాల్గొన్నారు.