Prajapalana | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఏదైనా తప్పు జరిగినప్పుడు కిందిస్థాయిలో ఒకరిని బలి పశువును చేయడం.. చేతులు దులుపుకోవడం.. జీహెచ్ఎంసీకి పరిపాటిగా మారింది. తప్పు జరుగడానికి మూలమేంది? అందుకు నిజమైన కారకులెవరు? అన్న కోణంలో విచారణ జరగడం లేదు. ఒకవేళ జరిగినా అసలైన బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులు వెనుకంజ వేస్తున్నారు. నిజానికి తప్పుచేసిన వారిని వెనకేసుకు వస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో ప్రజలు క్యూలైన్లో గంటలకొద్దీ నిల్చొని.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సమర్పించిన దరఖాస్తుల గతి ఏమైందో రెండు రోజులుగా ప్రజలు చూస్తున్నారు. హయత్నగర్కు చెందిన దరఖాస్తులు బాలానగర్ ఫ్లైఓవర్ మీద గాలికి కొట్టుకుపోయిన ఘటనపై జీహెచ్ఎంసీలో జరిగిన విచారణ, తీసుకున్న చర్యలు కిందిస్థాయి యంత్రాంగంలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. ఈ ఘటనకు అసలు కారకులెవరో ఉన్నతాధికారులందరికీ తెలుసు. ప్రస్తుత హయత్నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్కుమార్ గతంలో కూకట్పల్లిలో పనిచేశారు.
ఆ ‘బంధం’తోనే స్వయంగా చొరవ తీసుకొని దరఖాస్తులను ఎంట్రీ కోసం అక్కడికి పంపారు. కూకట్పల్లిలోని ధర్మేందర్ ఏజెన్సీకి 14వేల దరఖాస్తులను ఎంట్రీ చేసే బాధ్యతలు ఇచ్చారు. 80 దరఖాస్తులు ఆప్లోడ్ చేస్తే రూ.1000ల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఈ అభయహస్తం దరఖాస్తులు అప్పగించారు. మిగిలిన దరఖాస్తులు హయత్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఎంట్రీ అవుతున్నాయి. ధర్మేందర్ ఏజెన్సీకి అమీర్పేటలో మరో కేంద్రం ఉంది. దీంతో కొన్ని దరఖాస్తులను ర్యాపిడో బైక్పై అమీర్పేట కేంద్రానికి తరలించారు. వాస్తవానికి డాటా ఎంట్రీ ప్రక్రియ సంబంధిత అధికారి పర్యవేక్షణలోనే జరగాలి.
మరి ధర్మేందర్ ఏజెన్సీ చేస్తున్న డాటా ఎంట్రీకి పర్యవేక్షకులెవరు? తమకు ఇచ్చిన పత్రాలను ర్యాపిడో బైక్పై మరో కేంద్రానికి తరలించేందుకు ఆ సంస్థకు అనుమతి ఇచ్చిందెవరు? ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు. ఈ ఘటనలో డిప్యూటీ కమిషనర్ నిర్లక్ష్యం, అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తున్నా.. ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదనే సందేహం వ్యక్తమవుతున్నది. దరఖాస్తు తరలింపులో ఏజెన్సీ నిర్లక్ష్యం వహించినందుకు సదరు ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీసీ రవీందర్కుమార్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కానీ కూకట్పల్లి, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో ఎక్కడా ఇలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలపడం గమనార్హం.
హయత్నగర్ ఘటనలో టీం లీడర్పై వేటువేసిన ఉన్నతాధికారులు.. ఇదేరీతిన కుత్బుల్లాపూర్లో జరిగిన విషయంలో మాత్రం టీం లీడర్కు నోటీసు ఇచ్చి సరిపెట్టడం కూడా యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేస్తున్నది. కుత్బుల్లాపూర్ కార్యాలయం నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులను ఫలహారంలా పంపిణీ చేసినా.. అక్కడ అధికారులపై చర్యలు తీసుకోకపోగా, టీం లీడర్ భార్గవ నారాయణకు నోటీసు మాత్రమే ఇచ్చారు. బాలానగర్ ఫ్లైఓవర్ ఘటనపై విచారణ జరిపిన అధికారి డీసీ నిర్లక్ష్యాన్ని తన నివేదికలో ప్రస్తావించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ ఉన్నతాధికారులు ఈ వాస్తవాన్ని పరిగణలోనికి తీసుకోకపోవడం, కుత్బుల్లాపూర్ విషయంలో భిన్నంగా చర్యలు తీసుకోవడంపై జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. చర్యల విషయంలో అందరికీ ఒకే రూల్ను వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రజా పాలన కార్యక్రమంలో గ్రేటర్లో మొత్తం 24,74,325 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఐదు హామీలకు సంబంధించిన అభయహస్తం అప్లికేషన్లు 19 లక్షలకుపైగా ఉండగా మిగిలిన 5.73 లక్షల అప్లికేషన్లు రేషన్ కార్డు, ఇతర సమస్యలపై వచ్చాయి. అభయహస్తం దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17వ తేదీలోగా అప్లోడ్ చేసేలా ప్రత్యేక కార్యాచరణను ఆమలు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు 7 లక్షల దరఖాస్తులలోని డాటా ఎంట్రీని పూర్తిచేశారు. ఒక్కొక్క డాటా సెంటర్కు ఒక టీమ్ లీడర్ను నియమించారు. సరిల్ వారీగా ఎకడివి అకడ డాటా ఎంట్రీ చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ ప్రక్రియ గాడిలో పడింది. అభయహస్తం దరఖాస్తులు నడిరోడ్డు మీద దర్శనమివ్వడంపై ఈ నెల 9న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘రోడ్డెక్కిన ప్రజాపాలన’ శీర్షికన వెలువడిన కథనంతో ఒక్కసారిగా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఉలిక్కిపడింది. గడిచిన రెండు రోజులుగా కమిషనర్ రొనాల్డ్రోస్ వరుసగా జోనల్ కమిషనర్లతో సమీక్షలు జరుపుతూ లోపాలను సరిదిద్దుతూ డాటా ఎంట్రీని గాడిలో పెట్టారు. ఒక్క దరఖాస్తు కూడా బయటకు వెళ్లకుండా మున్సిపల్ పరిధిలోనే డాటా ఆపరేటర్లపై పర్యవేక్షణ పెట్టి దరఖాస్తుల వివరాలను కంప్యూటీకరిస్తున్నారు. రొనాల్డ్రోస్ తొలిరోజు ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలోని డాటా ఎంట్రీ సెంటర్లను, బుధవారం సికింద్రాబాద్ జోన్లో బేగంపేట, సికింద్రాబాద్ సరిళ్లకు సంబంధించిన దరఖాస్తుల డాటా ఎంట్రీ సెంటర్లను పరిశీలించారు. జోనల్ కమిషనర్లను ఎప్పటికప్పుడు ఆప్రమత్తం చేస్తూ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.