Krishna Water | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ ): గ్రేటర్ ప్రజల దాహార్తి తీర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్న కృష్ణా జలాల నీటి నిల్వలపై జలమండలి ఆప్రమత్తమైంది. కృష్ణా బేసిన్లో ఈ ఏడాది సరైన వరద లేకపోవడంతో గతంలో కంటే శ్రీశైలం, సాగర్లో కలిపి 12.86 టీఎంసీల నీటి కొరత ఏర్పడింది. దీనికితోడు ఏపీ కనీసం 15 టీఎంసీలు వాడుకునే అవకాశం కనిపిస్తుండడంతో ఈ వేసవిలో అత్యవసర పంపింగ్ తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జునసాగర్లో ప్రస్తుత నీటిమట్టం 520 అడుగులు ఉండగా, 512 అడుగులకు చేరగానే ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటిని తరలించే దిశగా జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది.
సాగర్ ఫోర్షోర్లో 8 అత్యవసర మోటార్లు (స్టాండ్బై 4 మోటార్లు)ఏర్పాటు చేసి నగరానికి రోజూ మూడు దశల్లో 270 ఎంజీడీల (మిలియన్ గ్యాలన్ పర్ డే) చొప్పున నీటి ని తరలించి కొరతను అధిగమించే దిశగా కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు జలమండలి బుధవారం అత్యవసర మోటార్ల పంపింగ్ కోసం రూ.3.15 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. సాగర్లో 510 అడుగుల మేర నీటిని మెయింటెన్ చేయాలని ఇప్పటికే ఇరిగేషన్శాఖకు లేఖ రాసిన జలమండలి నీటిమట్టం 512 అడుగులకు చేరగానే అత్యవసర పంపింగ్ మొదలు పెట్టేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది.
సరిగ్గా ఆరేండ్ల తర్వాత
నాగార్జునసాగర్ నుంచి అత్యవసర మోటార్ల ద్వారా నగరానికి నీటి తరలింపు జలమండలికి కొత్తేమీ కాదు. అత్యవసర తరలింపు ప్రక్రియను 2017లో కొన్ని నెలల పాటు నడిపించారు. సరిగ్గా ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడా పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కృష్ణాబేసిన్లో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటే హైదరాబాద్కు నీటికష్టాలు తప్పనట్టే.