హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చించారు. అమలులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించినట్టు తెలిసింది. చర్చల అనంతరం ప్రధానంగా 3 ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించి ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనంతరం దీనిపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సంబంధించి అధికారులు మూడు ప్రతిపాదనలను తయారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.955గా ఉన్నది. ఈ పథకంలో భాగంగా రూ.500 వినియోగదారుడు భరిస్తుండగా మిగిలిన రూ.455 సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని ఎవరికి అందించాలనే అంశంపై మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో ఒకటి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని, మరొకటి గ్యాస్ కంపెనీలకే ఇవ్వాలని ప్రతిపాదించగా మూడోది వినియోగదారులకే నేరుగా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. రాజస్థాన్ మాదిరిగా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు సబ్సిడీ అమౌంట్ను తీసుకొనేందుకు అంగీకరించకపోవచ్చని తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో కంపెనీల ప్రతినిధులు, సివిల్ సైప్లె అధికారులు వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? వారిలో ఎంత మంది రేషన్కార్డు కలిగి ఉన్నారు? వినియోగదారులవారీగా వివరాలను అందించాల్సిందిగా గ్యాస్ కంపెనీలను పౌరసరఫరాల అధికారులు కోరగా ఇందుకు వారు నిరాకరించినట్టు తెలిసింది. కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, అప్పుడే సమాచారాన్ని అందించగలమని చెప్పినట్టు తెలిసింది.
500కే గ్యాస్ సిలిండర్ అమలు కోసం తెల్ల రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 90 లక్షల తెల్ల రేషన్కార్డులున్నాయి. సుమారు 1.24 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 90 లక్షల తెల్ల రేషన్కార్డుల్లో సుమారు 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేదు. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే 500కు గ్యాస్ కనెక్షన్ వర్తించే అవకాశం ఉన్నది. 64 లక్షల కార్డులకు రూ.1,747 కోట్ల ఆర్థిక భారం మాత్రమే ప్రభుత్వంపై పడనున్నది.