హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలను ఆహార భద్రత కార్డులకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. దాంతో సుమారు 10 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నట్టు తెలిపింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆహార భద్రత కార్డుదారుల వివరాలను పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించినట్టు వెల్లడించింది. ఇప్పటివరకు తెల్ల రేషన్కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత వైద్యం నిబంధన ఉండేది. రాష్ట్రంలో సుమారు 77 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి.