మహబూబ్నగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ హయాంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సాయం కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మక్తల్లో చిట్టెం రామ్మోహన్రెడ్డి, మద్దూర్లో పట్నం నరేందర్రెడ్డి, భూత్పూరులో ఆల వెంకటేశ్వర్రెడ్డి, పెంట్లవెల్లిలో బీరం హర్షవర్ధన్రెడ్డి, కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డితోపాటు గద్వాలలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత వాటి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. పథకాలను అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ పేరు తెచ్చుకున్నదని విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల విషయంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా రద్దుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఈ పథకాలను తిరిగి పునరుద్ధరించేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
పెంట్లవెల్లి, ఆగస్టు 17 : బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిర్వీర్యానికి కా ంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆరోపించా రు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బీమా పథకాల రద్దుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రధాన రహదారిపై 2గంటల సేపు రోడ్డుపై బైఠాయించి, కాంగ్రెస్ సర్కారుపై నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద కుటంబాలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాల్సిందిపోయి ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పనుతుందన్నదన్ని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఆనవాలు తుడిచిపెట్టె కుట్రలో భాగంగా హైకోర్టు తీర్పును సాకుగా చూపి సం క్షేమ పథకాలను ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బీరం మండిపడ్డారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అంశంపై హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చినా ఈ చేతకాని కా ంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెంట్లవెల్లి చౌట చెరువుకట్ట వెడల్పు పనులకు నిధులు మంజూరు చేయించి 90శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయలేకపోయిన అసమర్థత మంత్రి జూపల్లి అని విమర్శించారు. పెంట్లవెల్లి మండల కేంద్రానికి ఒక ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించలేని చేతకాని మంత్రి జూపల్లి అని ఎద్దేవా చేశారు. గోప్లాపురంలో సంక్షేమ పథకాల అమలులో మహిళా సర్పంచ్కు సమాచారం ఇవ్వకుండా అవమాన పరిచిన ఘనత ఈ కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని విమర్శించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించేందు కోసం సీఎం వెంటనే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం డిమాండ్ చేశారు. అనంతరం సంక్షేమ పథకాలు కొన సాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తాసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు రాజేశ్, సురేందర్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోవురాజు, పెంట్లవెల్లి, గోప్లాపురం, శింగవరం, తడకలవారి తండా గ్రామాల సర్పంచులు మారుపాకుల చిట్టెమ్మ, మేడిపల్లి సరిత, బాలరాజ్గౌడ్, పరశురాముడు, నాయకులు బిచ్చిరెడ్డి, విజయరామరావు, వెంకటనర్సింహారెడ్డి, రఫి, అబ్దుల్హుస్సేన్, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.