హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ)/అబిడ్స్: రంజాన్ను పురస్కరించుకొని ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పరిశీలించారు. అనంతరం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతున్నదని కొనియాడారు. అటు.. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చూడాలని సూచించారు.
వేదికను అందంగా అలంకరించాలని, ఆహార పదార్థాల నాణ్యతను ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ చేయించాలని స్పష్టం చేశారు. విద్యుత్తు, తాగు నీటికి ఆటంకం రావొద్దని, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్య కూడళ్లలో స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ సలీం, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, టీఆర్ఎస్ మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఎంకే భద్రుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.