హైదరాబాద్ : తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. భద్రాచలంను మూడు కొత్త గ్రామాలుగా వికేంద్రీకరణ చేస్తూ, భద్రాచలం జిల్లాలోని ఐటీసీ గ్రామం, ఆసిపాబాద్లోని రాజంపేట గ్రామాలను నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని మంత్రి ప్రవేశపెట్టారు.
భారత రాజ్యాంగంలోని పార్ట్ 9ఏ లోని ఆర్టికల్ 243-జడ్సీ (3) లో సూచించిన విధంగా పార్లమెంటు షెడ్యూల్డ్ ప్రాంతాలను విస్తరించే వరకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో మున్సిపాలిటీలు సాధ్యం కాదని ఆయన అన్నారు.ఏజెన్సీ ఏరియా కావడంతో భద్రాచలంను మున్సిపాలిటీగా కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా వికేంద్రీకరణ చేయాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 షెడ్యూల్ 8ని సవరించడానికి తీసుకొచ్చిన బిల్లు ప్రకారం భద్రాచలం, సారపాక , ఆసిఫాబాద్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిందని తెలిపారు. దీంట్లో భాగంగా భద్రాచలంను భద్రాచలం , సీతారాం నగర్, శాంతి నగర్ అనే మూడు గ్రామాలుగా మార్చేందుకు తీర్మానం ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక గ్రామ పంచాయతీని సారపాక , ఐటీసీ గ్రామాలుగా మారుస్తు తీర్మానం చేశామన్నారు.
అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీకి ఆసిఫాబాద్, జనకపూర్ , రాజంపేట, గొడవెల్లి అనే నాలుగు రెవెన్యూ గ్రామాలను కలిగి ఉందని వివరించారు. వీటిలో రాజంపేట గ్రామం 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 185 ఎకరాల విస్తీర్ణం, జనాభా వెయ్యి 794 ఉందన్నారు. ఈ గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా మారుస్తూ నిన్న శాసనసభ, ఆదివారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలుపడం పట్ల మండలి చైర్మన్కు, సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.