మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పల్లె ప్రగతి, హరిత హారంలో భాగంగా శనివారం మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, పెద్ద తండా (మంత్రి స్వగ్రామం)లో పల్లె ప్రకృతి వనంను ప్రారంభించి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన గ్రామ సభలో మంత్రితో పాటు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, సర్పంచ్ వనజా శ్రీరామ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో కొమురయ్య, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. స్వగ్రామంలో పల్లె ప్రకృతి వనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనేక తండాలు సీఎం కేసిఆర్ వల్ల గ్రామ పంచాయతీలు అవతరించాయన్నారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమం ఆగలేదన్నారు. కలిగిన వాళ్ల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి భూముల్లో అంతిమ సంస్కారాలు చేస్తుంటారు. అయితే పేదలు రోడ్డు పక్కన, ఏటి కాలువల పక్కన దహన సంస్కారాలు చేసే పరిస్థితి ఉందన్నారు. పేదల అంతిమ సంస్కారాలు కూడా గౌరవంగా జరగాలని భావించి సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు కట్టించారన్నారు.
మరుగుదొడ్లు అందరూ కట్టుకోవాలని, కట్టుకున్న వారు వినియోగించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. మానుకోటకు త్వరలో సీటీ స్కాన్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మంత్రిగా ఉన్నందుకు సాగునీటిని గుండ్రాతి మడుగు వరకు తెచ్చినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులంతా కలిసి కట్టుగా, కుటుంబ సభ్యులుగా పని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.