Housing Board | హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ): హౌసింగ్ బోర్డు ఆధీనంలోని విలువైన భూములు, షాపింగ్ కాంప్లెక్స్లలోనూ ఆంధ్రప్రదేశ్ సమాన వాటా కోరుతున్నది. ఢిల్లీలో ఏపీభవన్ను విభజించిన తరహాలోనే ఇక్కడి ఆస్తులను కూడా విభజించాలని పట్టుబడుతున్నది. హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండగా, అది కుదరదని.. కేంద్ర ప్రభుత్వం ఆస్తులను పంపిణీ చేసేవరకు ఏమీ చేయలేమని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యాక ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏపీ పునర్విభజన చట్టంలో హౌసింగ్బోర్డును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడంతో ఆస్తులు, అప్పులను రెండు రాష్ర్టాలు సమానంగా పంచుకోవాల్సి ఉంది. హౌసింగ్బోర్డుకు హైదరాబాద్తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 4,609 ఎకరాలు ఉండగా, అందులో 3,820 ఎకరాల్లో ఇదివరకే కాలనీలు నిర్మించారు. మిగిలిన 789 ఎకరాల్లో దాదాపు 80 ఎకరాలపై కోర్టులో కేసులు ఉన్నాయి. 610 ఎకరాలు క్లియర్గా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇవికాకుండా జేఎన్టీయూకి లీజుకిచ్చిన 100 ఎకరాలు సహా మొత్తం 150ఎకరాల భూమి లీజులో ఉంది. కొన్ని భూములపై కోర్టులో వివాదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ ఎంజే రోడ్, మహబూబ్గంజ్, బషీర్పల్లి, విజ్ఞాన్పురి, వెంగళరావునగర్, బర్కత్పుర తదితర ప్రాంతాల్లో 300 వరకు దుకాణాలు ఉన్నాయి. ఇవికాకుండా గృహకల్ప, గగన్విహార్, చంద్రవిహార్, ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీసు, మనోరంజన్ కాం ప్లెక్స్, తుల్జాగూడ కాంప్లెక్స్, ఎస్ఆర్నగర్ కాంప్లెక్స్ తదితర భారీషాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు కొనసాగుతుండగా, వీటిపై ప్రస్తుతం నెలకు రూ. మూడు కోట్ల వరకూ అద్దెలు వస్తున్నాయి. హౌసింగ్బోర్డు ఉద్యోగుల జీతభత్యాలు ఈ అద్దెల ద్వారానే సమకూరుతున్నాయి. ఏళ్లుగా హౌసింగ్బోర్డు భవనాలు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ల అద్దెలు పెంచక అద్దెలు నామమాత్రంగానే వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో అప్పటి ప్రభు త్వం ఈ దుకాణాలను విక్రయించాలని నిర్ణయించి ఉత్తర్వులు కూడా జారీచేసింది. అప్పటి మార్కెట్ రేట్ప్రకారం 11 దుకాణాలను విక్రయించగా, వివిధ కారణాలతో మిగతావాటి విక్రయం నిలిచింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు హౌసింగ్బోర్డు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అధికారులను కోరింది. భూముల ధరలు భారీగా పెరగడంతోపాటు గృహనిర్మాణ రంగంలోకి అనేక ప్రైవేటు కంపెనీలు అడుగుపెట్టిన నేపథ్యంలో హౌసింగ్బోర్డు ద్వారా ఇండ్లు నిర్మించి విక్రయించే కంటే ఉన్న భూములు, షాపింగ్ కాంప్లెక్స్లను విక్రయించడమే మేలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లో హౌసింగ్బోర్డు ఉండడంతో ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులను పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. చర్చించుకొని ఓ ఒప్పందానికి వస్తే ఆస్తుల పంపిణీకి కేంద్ర హోంశాఖ తగిన ఉత్తర్వులు జారీచేస్తుందని, ఆ తర్వాతే విక్రయం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ఇటీవల ఢిల్లీలోని ఏపీభవన్ విభజన విషయంలో ఇరు రాష్ర్టాలు చర్చించుకొని అంగీకారానికి వచ్చిన తరువాత ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీభవన్ విభజన ప్రక్రియను పూర్తిచేసింది.
రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్ (ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు)తోపాటు పదో షెడ్యూల్(నిర్దిష్ట రాష్ట్ర సంస్థల్లో సౌకర్యాల కొనసాగింపు) ఆస్తులను సమాన నిష్పత్తిలో పంచాలని ఏపీ ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రెండు షెడ్యూల్లలో 233 సం స్థలు సహా మరో 12 సంస్థలను పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని కోర్టుకు తెలిపింది. 245 సంస్థల ఆస్తుల విలువ సుమారు 1,42,601 కోట్లుగా ఏపీ పేర్కొంటున్నది. ఇందులో ఎక్కువ ఆస్తులు హైదరాబాద్లోనే ఉన్నాయని, వీటిని ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చేసినట్టు చెబుతున్నది. వీటిని సమాన నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఏపీ కోరుతున్నది.