‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ అంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇచ్చిన నినాదం పలు రాష్ర్టాల్లో సంచలనం సృష్టిస్తున్నది. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు అనేక మంది నాయకులను కదిలిస్తున్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ప్రగతి- పథకాలు వివిధ రాష్ర్టాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రగతి కోసం, పరివర్తన తెచ్చే నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్న వివిధ సామాజిక వర్గాలు ఇప్పుడు కేసీఆర్ వెంట నడవడానికి బారులు తీరుతున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘జై భారత్’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవచిస్తున్న విధి విధానాలు, అభివృద్ధి లక్ష్యాలను దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్న పలువురు సామాజికవేత్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు కేసీఆర్ను కలుస్తామంటూ సందేశాలు పంపుతున్నారు. బీఆర్ఎస్లో చేరడానికి ఉత్సాహపడుతున్నారు. పొరుగు రాష్ట్రం, సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ వ్యాప్తి అన్ని జిల్లాల్లోనూ అలజడి సృష్టిస్తున్నది. అభివృద్ధి ఎజెండాలేని వ్యక్తిగత వైర రాజకీయాలతో ఏపీ గబ్బుపట్టిపోతున్నదని ఆవేదన చెందుతున్న పలువురు క్షేత్రస్థాయి నాయకులు కేసీఆర్ను కలిసేందుకు, బీఆర్ఎస్లో చేరేందుకు బారులు తీరుతున్నారు. ప్రస్తుత రాజకీయాల తీరుతో విసిగిపోయి దూరంగా ఉన్న పాత నాయకులు, మార్పు కోసం, ఏపీ అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న కొత్తవారు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందు లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులు, చేతి వృత్తి సంఘాల నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు బీసీ కులాల నేతలు, ప్రతినిధులు గురువారం హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా గొర్రెల పెంపకందార్ల సహకార సంఘాల మాజీ చైర్మన్, బీసీఎఫ్ (ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణయాదవ్ ఆధ్వర్యంలో పలువురు బీసీ సంఘాల నాయకులు కేసీఆర్తో సమావేశమై పలు అంశాల మీద చర్చించారు. సీఎంను కలిసినవారిలో పద్మశాలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు దివి కోటేశ్వరరావు, వలనుకొండ మల్లేశ్వరరావు,
సామాజికవేత్త తోటకూర కోటేశ్వరరావు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, బీసీ సంఘం నేత రామనాథం అంజన్రావు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 8 సంవత్సరాల్లోనే కేసీఆర్ సారథ్యంలో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని వారు కొనియాడారు. “మా కండ్ల ముందే పాలమూరు పచ్చబడ్డది. వలసలకు కాలం చెల్లిపోయింది. ఇక్కడ 24 గంటల కరెంటు సాధ్యమైంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందుతున్నది. ఇక సంక్షేమ పథకాల గురించి, హైదరాబాద్ అభివృద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ నాయకత్వంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. మీ మార్గదర్శనం ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఎందుకు అందకూడదు?” అని వారు కేసీఆర్తో అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ముగిసిన అధ్యాయమని, విభజన వివాదాలకు కాలం చెల్లిపోయిందని అభిప్రాయపడిన వారు… “బీఆర్ఎస్ దేశవ్యాప్త పార్టీ. ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ర్టాల శ్రేయస్సును బీఆర్ఎస్ తన ఎజెండాగా పెట్టుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం మీ ఎజెండాలో ఎందుకు ఉండకూడదు? మేమెందుకు వెనకబడి ఉండాలి. ప్రాక్, పశ్చిమ, ఉత్తర భారతాలకు బీఆర్ఎస్ విస్తరించాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు విస్తరించకూడదు. మేమూ తెలుగు వాళ్లమే. తెలంగాణకు పక్కనే ఉన్నాం కదా! మా శ్రేయస్సు మీ శ్రేయస్సు కాదా? మా బాగు తెలంగాణ బాగు కాదా” అని వారు కేసీఆర్తో అన్నారు.
తెలంగాణ నమూనా మాకూ కావాలి
కేసీఆర్ ధైర్యంగల్ల తెలుగు బిడ్డ అని, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఏపీకైనా, దేశానికైనా కేసీఆరే ఆశాకిరణమని ఏపీ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఆయన మార్గదర్శనంలో తెలంగాణ ఎట్లా బాగుపడ్డదో, ఎనెన్ని సంక్షేమ పథకాలను ఆవిష్కరించిందో, ఎన్ని ప్రగతి సూచికల్లో ప్రథమ స్థానంలో నిలిచిందో తామంతా చూస్తూనే ఉన్నామని, అలాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్కు కూడా అవసరమని వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తెలంగాణ ప్రగతి నమూనా ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతం కావాల్సి ఉందని, అందుకు సమయమూ ఆసన్నమైందని వారు అన్నారు. రెండు కులాల మధ్య వైరంతో సాగే రాజకీయాలతో ఏపీ గబ్బుపట్టి పోయిందని, అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు మాత్రమే లక్ష్యంగా పనిచేసే కొత్త నాయకత్వం రావాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో కేసీఆర్ తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని అభివృద్ధి చేయగలిగారని, అదే తరహాలో ఆంధ్రాలో కూడా కొత్త నీరు రావాల్సిన తరుణం ఆసన్నమైందని సూచించారు.
“ఆంధ్రప్రదేశ్ అంటే కులాలు కాదు; పార్టీలు అంతకన్నా కాదు. మాకు కావాల్సిందీ కులాలు, పార్టీలు కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రజలు. ఆ ప్రజలిప్పుడు తమ గతి ఇట్లా ఎందుకైందా? తమను బాగు చేసే వారెవరు అని ఎదురు చూస్తున్నారు. ఆ ప్రజల ప్రతినిధులుగా మేం మిమ్మల్ని కోరుతున్నాం.. ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించండి. ఢిల్లీలో పార్టీ ఆఫీసు పెట్టిన మీరు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు రారు?” అని అడిగారు. కేసీఆర్ అనుమతిస్తే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు జెండా, ఎజెండాతో బయలుదేరుతామని తెలిపారు. తాము బీఆర్ఎస్లో చేరడానికి అవకాశమివ్వాలని కోరారు. కేసీఆర్ దార్శనికతతో తెలంగాణను ప్రగతిపథంలో నడిపిస్తున్న తీరు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, అవి సాధిస్తున్న ఘన విజయాలు, ఆంధ్రా ప్రజలనే కాకుండా యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ మాదిరి ఆంధ్రప్రదేశ్ను కూడా ప్రగతి పథంలో నడిపించగల సత్తా కేసీఆర్కు ఉన్నదని భావిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రగతి దాయక పాలన, ఏపీకి చెందిన బడుగు, బలహీనవర్గాల్లో సరికొత్త ఆశను రేకెత్తిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమకూ అవకాశమిస్తే ఏపీలోని అన్ని జిల్లా లు, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని అధినేతకు వివరించారు. వారి ప్రతిపాదన పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ను కలిసిన వారిలో రాజులు, కాపులు, కొప్పుల వెలమలు, బీసీలు తదితర సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులున్నారు. తమ అనుచరులు, గ్రామాల్లో ప్రజలు కేసీఆర్ను కలవడానికి ఉత్సాహంగా ఉన్నారని వారు వెల్లడించారు.
బీఆర్ఎస్పై గ్రామాల్లో చర్చ
బీఆర్ఎస్పై బయట కనబడుతున్నదానికన్నా గ్రామాల్లో, సామాజికవర్గాల్లో ఎక్కువ ఆసక్తి, అలజడి ఉన్నాయని ఏపీ ప్రతినిధులు వివరించారు. కేసీఆర్ ఎజెండా ఏపీలో అమలైతే తప్పేమిటని ప్రజలే అడుగుతున్నట్టు వారు పేర్కొన్నారు. ఇటీవలే అర్చక సంఘాల సమాఖ్య సమావేశం జరిగిందని, తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమం జరిగినట్టుగా మరే రాష్ట్రంలోనూ జరగలేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటకకు చెందిన పలువురు రైతు ప్రతినిధులు గురువారం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డిని కలిశారు. తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గురువారం తెలంగాణ సరిహద్దులోని పలు మహారాష్ట్ర గ్రామాలను సందర్శించారు. బీఆర్ఎస్పై అక్కడి ప్రజల్లో నెలకొన్న ఆసక్తిని గమనించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ అధిష్ఠానానికి ఫోన్ల ద్వారా సందేశాలు అందుతున్నాయి. అధినేత సూచనలు సలహాలతో, ఆయా రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు భారీ భూమికను సిద్ధం చేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి అనుచరులు, శ్రేయోభిలాషులతో సమాలోచనలు జరిపి, చేరికలకు పూర్వరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ జెండాను, ఎజెండాను వారి వారి రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.