హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం అలాంటి ఫిర్యాదులను లేవనెత్తడానికి అపెక్స్ కౌన్సిల్ సరైన వేదిక అని తెలంగాణ సూచించింది.
రిట్ పిటిషన్, సుప్రీంకోర్టు, సదరన్ జోనల్ కౌన్సిల్, ఎన్జీటీ, హెచ్సీ వంటి బహుళ వేదికల్లో ఏపీ ప్రభుత్వం పదేపదే ఫిర్యాదులు చేస్తూ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నదని ఆక్షేపించింది. ఇరు రాష్ర్టాల వాదనల అనంతరం ఏపీ ఫిర్యాదుపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణకు 4 వారాల గడువును, కౌంటర్ రిప్లయి దాఖలు చేసేందుకు ఏపీకి రెండువారాల గడువును ఇస్తూ విచారణను జనవరి 24కు వాయిదా వేసింది.
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్-2 ముందు గురువారం రెండోరోజు కూడా వాదనలు కొనసాగాయి. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ తాళపత్ర సమక్షంలో ఢిల్లీలో తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మైనర్ ఇరిగేషన్ వినియోగాలు, కృష్ణా నదీ జలాల్లో వాటాలపై అడిగిన ప్రశ్నలకు చేతన్ దీటుగా సమాధానమిచ్చారు.