హైదరాబాద్, మార్చి 31 (నమస్తేతెలంగాణ) ః కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. 2020లో ఇచ్చిన ఉత్తర్వుల అమలులో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహించిన హైకోర్టు ఐఏఎస్లు విజయ్కుమార్, శ్యామలరావు, జీకే ద్వివేది, బుడితి రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చినవీరభద్రుడు, ఎంఎం నాయక్లకు శిక్ష వేసింది. దీంతో ఈ ఎనిమిది మంది అధికారులు హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన హైకోర్టు జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు చొప్పున ఏడాదిపాటు సేవ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయాల తొలగింపుపై ఇచ్చిన ఉత్తర్వులను ఏడాది అయినా అమలు చేయలేదని అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టు ధిక్కరణగా భావించింది.