హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు (జీఆర్ఎంబీ) తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. గోదావరిలో నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం హైడ్రాలజీ విభాగం ఇటీవల అధ్యయనం చేయడంతోపాటు అందుకు సంబంధించిన నివేదికను జీఆర్ఎంబీకి అందజేసిన సంగతి తెలిసిందే. 75 శాతం డిపెండబులిటీ ఆధారంగా లోయర్ గోదావరి జీ10 సబ్బేసిన్లో పోలవరం వద్ద 498.07 టీఎంసీల లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇదే అంశంపై జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖను రాసింది. జీ10 బేసిన్లో తెలంగాణ ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా 287.18 టీఎంసీలను వినియోగించుకుంటున్నది. 126.6 4 టీఎంసీల వినియోగానికి పలు ప్రాజెక్టుల నిర్మా ణం కొనసాగుతున్నది. భవిష్యత్ అవసరాలకు 8.88 టీఎంసీలు రిజర్వు చేసుకోవడంతోపాటు వివిధ హైడ్రో పవర్ ప్రాజెక్టులకు 12.20 టీఎంసీలను ఉపయోగించుకుంటున్నామని వివరించింది. సీడబ్ల్యూసీ మాత్రం ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మాణంలో ప్రాజెక్టుల జలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని తెలంగాణకు 406.07 టీఎంసీలు మాత్రమే ఉన్నట్టు అంచనా వేసిందని, ఇది సరికాదని స్పష్టం చేసింది. 28.84 టీఎంసీలు కూడా తెలంగాణకు గోదావరి జలాల్లో కేటాయించిన 967.94 టీఎంసీల్లో భాగమేనని తేల్చిచెప్పింది.