హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ) : వేసవి తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా 10టీఎంసీల జలాలను విడుదల చేయాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు)కి తాజాగా ప్రతిపాదననలు సమర్పించింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో వేసవి తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపాల్సి ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం సాగర్లో 28.21 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉండగా, అందులో 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి లేఖ రాశారు. ఏపీ కోరిందే తడువుగా కేఆర్ఎంబీ 5వ తేదీన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తెలంగాణ సర్కార్కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. వాస్తవంగా ప్రతి నీటి సంవత్సరం ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలను త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. కానీ, ఈ ఏడాది నీటి వినియోగాలకు సంబంధించి ఇప్పటివరకు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏ ర్పాటుచేయలేదు. ప్రస్తుతం ఏపీ నీటిని కోరుతూ ఇండెంట్ సమర్పించగానే బోర్డు హడావుడిగా సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఏపీ ఇండెంట్పై అభిప్రాయాలు తెలుపాలని, వాటిపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చిస్తామని తెలిపింది.