హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ భారీ ఉద్యమాన్ని నడిపించనున్నదని, అందుకు రూట్మ్యాప్ సిద్ధం అవుతున్నదని తెలిపారు.
కేంద్రం ఉద్దేశపూర్వకంగా స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టిందని, దీనిపై ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విసిరిన సవాల్ను స్వీకరించే దమ్ము ఏపీలో ఏ పార్టీకీ లేదన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 10న ఆ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించనున్నామని, వారితో చర్చించిన తర్వాత భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామని తోట తెలిపారు.