హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా మారిందని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రెండున్నరేండ్ల పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో ఉండాల్సిన యూరియా యాప్ల్లోకి తెచ్చిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కిందని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్కు ఢిల్లీకి మూటలు మోయడం మీద ఉన్న శ్రద్ధ, కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల మూటలను కొనుగోలు చేయడంపై లేదని దెప్పిపొడిచారు. రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమని ఖండించారు. తెలంగాణ మాండలికంలో ఎక్కడ సచ్చిండని రాహుల్ను ఉద్దేశించి సంబోధించిన కేటీఆర్పై కేసు పెట్టిన రేవంత్రెడ్డి.. వడ్లకుప్పలపై రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు.. మరి నీపై ఎన్ని కేసులు పెట్టాలి? అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సావు కోరిన రేవంత్రెడ్డిని ఉరితీసినా తప్పులేదని స్పష్టం చేశారు.