హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ)/ వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతులు పండించే పంటలను వినియోగించుకోలేని దుర్భర స్థితిలో కేంద్రం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న అగ్రి ఎక్స్పోను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం తీరు ‘మేము కొనం.. మీరు సాగు చేయొద్దు’ అన్నట్టుగా ఉన్నదని అన్నారు. వ్యవసాయ రంగానికిమించి ఉపాధి కల్పించే రంగం దేశంలో మరొకటి లేదని, వ్యవసాయంతోపాటు అనుబంధ పరిశ్రమలు, సాంకేతికతలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు.
సాంకేతికతను రైతుల వద్దకు చేర్చాలి
యువత వ్యవసాయరంగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నేటి యువత ఉపాధినిచ్చే రంగాలను వదిలి ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఎండమావుల వైపు పరిగెత్తుతున్నదని పేర్కొన్నారు. పెరిగిన శాస్త్ర సాంకేతికత రైతుల వద్దకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న అధిక పెట్టుబడి సమస్యను పరిష్కారించాలని అన్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ మానవ శ్రమతో అధిక రాబడి, లాభాలు సాధించడంపై పరిశోధకులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి జీవం పోశారని, ఇప్పుడు వ్యవసాయరంగంలో తెలంగాణ దేశానికి కొత్త దారి చూపుతున్నదని తెలిపారు. రైతుబంధు పథకం ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 20 పథకాల్లో ఒకటి అని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని గుర్తు చేశారు. తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయరంగం వాటా 21 శాతమని చెప్పారు. ఒకప్పుడు రేషన్ బియ్యం కోసం ఎదురుచూసిన రాష్ట్ర రైతులు, నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.