ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 17: విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల (డ్రగ్స్) కట్టడికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకరానున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. విద్యార్థినులపై వేధింపులు, ర్యాగింగ్ నివారణకు ఈ చట్టం దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యాసంస్థలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు యాంటీ డ్రగ్స్ కమిటీ (ఏడీసీ)లను శనివారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 140 కోట్ల దేశ జనాభాలో 11 కోట్ల మంది (దాదాపు 8 శాతం) డ్రగ్స్ బారిన పడినట్టు నేషనల్ నార్కోటిక్స్ కంట్రో ల్ బ్యూరో తెలిపిందని, ఇది చాలా అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో విద్యాసంస్థలు పనిచేయకపోవడంతో గ్రామ, మండలస్థాయిలో గంజాయి వినియోగం పెరిగిందని, ప్రస్తుతం దేశవ్యాప్త సమస్యగా మారిందన్నా రు. డ్రగ్స్ తీసుకొనే వారిలో అమ్మాయిలు దాదాపు 50 శాతం ఉన్నారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకొంటుండటం వల్ల నగరం డ్రగ్స్ ఫ్రీగా మారిందని వెల్లడించారు. గోవాలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, పిల్లలను అక్కడికి వెళ్లనీయకపోవడం మేలని సూచించారు. నగరవ్యాప్తంగా 246 కళాశాలల్లో ఏడీసీ కమిటీలను ఏర్పాటు చేశామని, త్వరలో పాఠశాల స్థాయిల్లో వీటిని ప్రారంభిస్తామని కమిషనర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో మానసిక వ్యాధి నిపుణుడు డాక్టర్ సందీప్, అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, ఈస్ట్జోన్ డీసీపీ సునీల్దత్, టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి, అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.