హుస్నాబాద్, జూన్ 23: రేవంత్రెడ్డి పాలనలో పాత బకాయిలు మరో మాజీ సర్పంచ్ ప్రాణం తీశాయి.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ పాలనలో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అప్పులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిన మాజీలకు చివరికి చావే శరణ్యమవుతున్నది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్కు చెందిన మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ (50) రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. ఆ సమయంలో గ్రామాభివృద్ధి కోసం రూ.11లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశాడు. అయితే దీనికి సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదు. ఇవన్నీ అప్పుల రూపంలో తేవడం, అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి కి గురిచేయడంతో సంపత్ మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే తనకు రావాల్సిన బిల్లులు వచ్చినా సర్పంచ్ తిరుమల తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ సమ్మరాజు, పంచాయతీ కార్యదర్శి హరిబాబు ఇవ్వడం లేదని తన సూసైడ్లో నోట్ పేర్కొన్నాడు. సంపత్కు భార్య స్వప్న, కొడుకు సంతోష్, కూతురు అభినయ ఉన్నారు. సంపత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదేండ్లపాటు సర్పంచ్గా పనిచేసిన సంపత్ ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను షాక్కు గురిచేసింది. మాజీ సర్పంచ్లు, వివిధ పార్టీల నాయకులు సంపత్ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా స్పందించి మాజీ సర్పంచ్లకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పదేండ్లు సర్పంచ్గా గ్రామానికి సేవలందించిన సంపత్ ఆత్మహత్యతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హు స్నాబాద్లోని కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సంపత్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉన్నాయని తెలిపారు. స్థానిక పోలీసులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు వెంకట్రామ్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, తోడేటి రమేశ్, మాజీ సర్పంచ్లు గద్దల రమేశ్, పీచర రాములు తదితరులు సంఘీభావం తెలిపారు.
మహ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలంగాణ సర్పంచ్ల సంఘాల జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. అప్పులు తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన పాపానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. బిల్లులు రాకపోవడంతో భూమి, పండ్లతోటను సైతం అమ్మి అప్పులు కట్టాడని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. పెండింగ్ బిల్లుల కోసం సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ను అనేకమార్లు కలిసినా ఏమాత్రం కనికరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
– యాదయ్యగౌడ్, తెలంగాణ సర్పంచ్ల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు