ధరూరు, ఫిబ్రవరి 28 : బోరు మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ధరూర్ మండలం నెట్టెంపాడుకు చెందిన యువ రైతు లొడ్డ తిప్పన్న అలియాస్ రాజేశ్ (30)కు భార్య రాజేశ్వరి, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈయనకున్న రెండెకరాల్లో పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలకు వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు మోటర్ ఆన్ చేసిన అనంతరం మోటర్ పైప్ వద్దకు వెళ్లి కేసింగ్ పైప్పై ఉన్న ఐరన్ కప్లింగ్ను పట్టుకున్నాడు. అప్పటికే కేబుల్ వైర్ కట్ అయి ఉండగా.. గమనించకపోవడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానిక రైతులు గుర్తించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా దవాఖానకు తరలించారు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది.