హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుధవారం తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఒకటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు దక్కనున్నది. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి తేదీ కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బుధవారం ప్రకటించే చాన్స్ ఉన్నది. ఈ నెల 11 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైనప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు కాలేదు.
కాంగ్రెస్ పార్టీకి రెండు రాజ్యసభ సీట్లు దక్కనుండగా అందులో ఒకటి ఏఐసీసీ కోటా నుంచి, మరొకటి టీపీసీసీ నుంచి ఎంపిక చేయనున్నట్టు అధిష్ఠానం ఇదివరకే నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఏఐసీసీ కోటాలో రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు ఏఐసీసీ కోశాధికారి, సీడబ్ల్యూసీ సభ్యుడు అజయ్మాకెన్ కాగా, మరొకరు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో సభ్యురాలు సుప్రియ ఉన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేసేది బుధవారం తేలిపోనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి, మాజీ మంత్రి కే జానారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, చల్లా వంశీచందర్రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఎంపికయ్యే అభ్యర్థిని ఇప్పటికే అధిష్ఠానం ఎంపిక చేసిందని, ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పార్టీ గోప్యంగా పెట్టి ఉంటుందని కూడా అంటున్నారు.
ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు దక్కనుండగా, ఇది ఎవరికి అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలో పదవీకాలం ముగియనున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఒద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. వీరిలో రవిచంద్ర పదవీ కాలం రెండేండ్లకే ముగియనుండటంతో ఖాళీ అయ్యే స్థానానికి తననే ఎంపిక చేస్తారని ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు. తన అభ్యర్థిని బుధవారం ప్రకటిస్తుందా? లేక నామినేషన్ల గడువు చివరి రోజైన గురువారం ప్రకటిస్తుందా? అనేది తెలియదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.