హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్డౌన్ సమయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ద్వారా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందిస్తున్న సేవలపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, కమిషనరేట్ అధికారులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంక్షేమ అధికారులు, సీపీడీవోలతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నవేళ ప్రజల ప్రాణాలే ప్రధానమని సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. ఈ కష్ట కాలంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీలు నిత్యావసరాలను ప్రజలకు అందించడంలో, ఇంటింటి సర్వే వివరాలు సేకరించడంలో, గర్భిణీలు, బాలింతలకు సరైన సమయంలో సరైన వైద్యం అందేలా చూడటంలో మరింత అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఏవైనా ఇబ్బందులుంటే జిల్లా సంక్షేమ అధికారులకు తమ దృష్టికి గానీ, కమిషనర్ దృష్టికి గానీ తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. గర్భిణీలకు కరోనా పాజిటివ్ వస్తే ఏ మందులు వాడాలో స్పష్టంగా చెప్పాలన్నారు. ఇతర ఎలాంటి మందులు వాడకూడదు అని కూడా వివరించాలన్నారు. పిల్లల కోసం మనం తీసుకుంటున్న చర్యలను మరింత ప్రచారం చేయాలన్నారు.
నిత్యావసరాల పంపిణీలో లోపం, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం నిత్యావసరాలను ఇంటింటికి అందిస్తున్న అంగన్వాడీల సేవలు మరువలేనివన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరిని అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.