హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జి కోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (బీఆర్టీయూ), టీఎన్జీవో, మినీ అంగన్వాడీ, సీఐటీయూ, ఏఐటీయూసీ యూనియన్ల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఇక నుంచి ప్రతినెలా అంగన్వాడీలకు 14న జీతాల పంపిణీకి, వేసవి సెలవుల్లో టేక్హోమ్ రేషన్ విధానం అమలు, ఇన్సూరెన్స్ కవరేజీ, హెల్త్కార్డు సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.
పెండింగ్ బిల్లుల సమస్యలను త్వరలో పరిషారిస్తామని హామీ ఇచ్చారు. మన అంగన్వాడీల నిర్వహణ దేశానికే ఆదర్శమని, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కొనియాడుతున్నాయని చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించడంతో ఆయా యూనియన్ల ప్రతినిధులు సీఎం కేసీఆర్కు, మంత్రి సత్యవతికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి కార్యదర్శి భారతి హోలికేరి, జాయింట్ డైరెక్టర్ సునంద, ఆయా యూనియన్ల నేతలు రాంబాబుయాదవ్, పీ నారాయణ, నల్ల భారతి, నిర్మల, వరలక్ష్మి, విజయలక్ష్మి, కరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.