హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని కంప్యూటర్, ల్యాప్టాప్ల వాడకం చాలా తగ్గింది. మొబైల్ యూజర్లలోనూ ఆండ్రాయిడ్ యూజర్లే ఎక్కువ. అయితే, ఆండ్రాయిడ్ ఓఎస్లో భద్రతాలోపాలు ఉన్నట్టు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది. ఆండ్రాయిడ్లోని ఆటోఫిల్ ఫంక్షనాలిటీ లాగిన్ సమాచారాన్ని లీక్ చేస్తున్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ అంకిత్ గంగ్వాల్, ఎంటెక్ విద్యార్థులు శుభమ్సింగ్, అభిజీత్ శ్రీవాస్తవ ఆన్లైన్ భద్రతపై పరిశోధన చేశారు.
‘ఆటోఫిల్ – క్రెడెన్షియల్ లీకేజ్ ఫ్రం మొబైల్ పాస్వర్డ్ మేనేజర్స్’ అంశంపై ట్రిపుల్ ఐటీ బృందం పరిశోధన చేసింది. ఆండ్రాయిడ్ యాప్లలో ఉండే ఆటోఫిల్ ఫంక్షనాలిటీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలా లీక్ చేస్తున్నది గుర్తించి ఒక పరిశోధన పత్రాన్ని రూపొందించారు. ‘డాటా అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ-2023’ అనే అంశంపై జరిగిన ఏసీఎం కాన్ఫరెన్స్లో వీరి పరిశోధన.. బెస్ట్ పేపర్ అవార్డు గెలుచుకున్నదని గంగ్వాల్ తెలిపారు. డిసెంబర్లో జరిగే బ్లాక్హ్యట్ యూరప్-2023 సదస్సులో ఈ పరిశోధనల వివరాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.