హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఉమ్మడి హైకోర్టు, రాజ్భవన్ లాంటి రాజ్యాంగబద్ధమైన ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.408.48 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు.
ఈ బకాయిలను వడ్డీ సహా చెల్లించాలని కోరుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2022 జూలై 5న లేఖ రాసిందని, దీంతో ఆ వివాదాన్ని పరిషరించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పలు సమావేశాలు జరిగాయని, ఖర్చుల వివరాలను సరిచూసుకోవాలని 2025 ఫిబ్రవరి 3న జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు సూచించిందని వివరించారు. ఆ అకౌంట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తాజాగా కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్)కు లేఖ రాసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ ఆర్థికశాఖ, పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఆ గణాంకాలను సరిచూసే బాధ్యతను తీసుకున్నట్టు ‘కాగ్’ కార్యాలయం గత నెల 8న లేఖ ద్వారా వెల్లడించిందని, దీంతో ఆ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రెండు రాష్ట్రాల అకౌంటెంట్ జనరల్స్ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని పంకజ్ చౌదరి తెలిపారు.